YSR Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 7 500, నేడు వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
Kurnool, June 1: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. 2023–24 సీజన్కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు.వెబ్ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్ఓఎఫ్ఆర్) భూముల సాగుదారులతోపాటు సెంటు కూడా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు.2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు సాయం అందించారు. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్ల మేర సాయం అందింది.
2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6944.50 కోట్లు చొప్పున సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజాగా 2023–24కి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందగా వీరికి తొలి విడతగా రూ.3923.22 కోట్ల మేర సాయం అందించనున్నారు.
(The above story first appeared on LatestLY on Jun 01, 2023 09:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

