CM YS Jagan Review Meeting: పనితీరు కనబర్చిన వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పేర్లతో సత్కారాలు, ఉగాది రోజున కార్యక్రమం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
CM YS jagan Review Meeting (Photo-Twitter)

Amaravati, Feb 22: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉగాది రోజున గ్రామ సచివాలయ వాలంటీర్‌లను సత్కరించే కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వాలంటీర్ల సేవలను గుర్తించేలా ప్రోత్సాహకాలతో వారిని గౌరవించాలని పేర్కొన్నారు. సేవారత్న, సేవామిత్ర.. పేరుతో ఇలా మంచి సేవలను అందించిన వాలంటీర్లను సత్కరించాలన్నారు.

ప్రణాళిక శాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం సమీక్షా సమావేశం (CM YS Jagan Review Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. నిర్ధేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని, మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్‌ వైజ్‌ చేస్తారని తెలిపారు.

10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపిన ఎస్ఈసీ, పోలీసుల పని భేష్, ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

అదే విధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న డేటాను స్వీకరించాలని సీఎం జగన్‌ (AP CM YS Jagan) పేర్కొన్నారు. ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఇ-క్రాపింగ్‌ లాంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీనివల్ల ఇ-క్రాపింగ్‌ జరుగుతుందా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టగలుగుతామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల వద్ద ఇంటర్నెట్‌ సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అన్న డేటా కూడా ఎప్పటికప్పుడు రావాలన్నారు.

దీనివల్ల పాలన, పనితీరు సమర్థవంతంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. సుస్థిర సమగ్రాభివృద్ధికోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రణాళికా శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్, కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈవో వి. కోటేశ్వరమ్మ, ఆర్టీజీఎస్‌ సీఈవో జే విద్యాసాగర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.