Eluru,Feb 4: ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో గల సుష్మితా డయాగ్నస్టిక్ సెంటర్ (Sushmita Diagnostic Centre) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.కనీస తనిఖీలు చేయకుండా మహిళను ఎమ్మారై మిషన్ (MRI Mechine) లోకి పంపిన సిబ్బంది.. ఆ తర్వాతనైనా ఆమెను పర్యవేక్షించకపోవడంతో రేడియేషన్ (Radiation) భరించలేక విలవిలలాడుతూ చనిపోయింది. భార్య విలవిలాడుతున్న విషయం ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా సిబ్బంది స్కానింగ్ను ఆపలేదు. దాంతో సదరు మహిళ భర్త కళ్లముందే ప్రాణాలు వదిలేసింది.
ఏలూరు రూరల్ మండలం ప్రత్తి కోళ్ళంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసమ్మకు గతంలో వైద్యులు పేస్ మేకర్ను అమర్చారు. గత కొన్ని రోజులుగా ఆయుష్ ఆస్పత్రిలో ఆమె డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ క్రమంలో రామతులసమ్మకు ఎమ్మారై తీయించుకోవాల్సిందిగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏలూరులోని సుష్మిత డయాగ్నొస్టిక్ సెంటర్కు డాక్టర్ రిఫర్ చేశారు.
డయాగ్నస్టిక్ సెంటర్ సిబ్బంది స్కానింగ్కు ముందు మెటల్ డిటెక్టర్తో మహిళను తనిఖీ చేయకుండానే మిషన్లోకి పంపించారు.మిషన్లోకి వెళ్లిన వెంటనే పేస్ మేకర్ కారణంగా ఆమె రేడియేషన్కు గురయ్యారు. రేడియేషన్ను భరించలేక రామతులసమ్మ మిషన్లో గిలగిలా కొట్టుకున్నారు. చివరకు రేడియేషన్ ప్రభావంతో స్కానింగ్ మిషన్లోనే ప్రాణాలు కోల్పోయారు.
స్కానింగ్ మిషన్లో భార్య ఉక్కిబిక్కిరి అవుతున్న విషయాన్ని గమనించిన భర్త కోటేశ్వర రావు స్కానింగ్ ఆపాలని సిబ్బందిని కోరినప్పటికీ వారు వినలేదు. నిర్లక్ష్యంగా స్కానింగ్ను కొనసాగించారు. ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా తన భార్య తన కళ్లెదుటే విలవిల్లాడుతూ మరణించిందంటూ భర్త కోటేశ్వర రావు విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.ఆస్పత్రి సిబ్బంది నిర్లక్షపు ధోరణిపట్ల కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డయాగ్నొస్టిక్ సెంటర్ వద్ద భర్త ఆందోళనకు దిగారు.