Amara Raja Infra Private Ltd: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీకి ఏపీ సర్కారు భారీ షాక్, 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, దీని విలువ సుమారు రూ.60 కోట్లకు పైమాటే
Amara Raja Infra Private Ltd (Photo-Twitter)

Amaravati, July 1: తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev) కంపెనీకి ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌కు (Amara Raja Infratech) ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటుకు కేటాయించిన భూమిలో 253.61 ఎకరాలను వెనక్కి తీసుకోవడానికి APIIC (ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌. కరికాల వలవన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిజిటల్ వరల్డ్ సిటీ / ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం అమరా రాజా ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 253.61 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కేటాయించింది.

అమరరాజ్‌ ఇన్‌ఫ్రా టెక్‌కు చిత్తూరు జిల్లాలో యాదమరి మండలం మజరా కొత్తపల్లి, బంగారుపాళెం మండలం నేనుగుండ్లపల్లి గ్రామాల పరిధిలో సెజ్‌ ఏర్పాటుకు 483.27 ఎకరాల భూమిని సర్కార్‌ కేటాయించింది. ఎకరానికి రూ .1.8 లక్షల మార్కెట్ విలువను చెల్లించి డిజిటల్ వరల్డ్ సిటీ / ఇండస్ట్రియల్ పార్క్ (Digital World City/Industrial Park) ఏర్పాటు చేసేందుకు అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌కు ఈ భూమిని అప్పగించింది. ఆ సంస్థకు భూకేటాయింపు సమయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో రెండేళ్లలోగా ఆ భూమిని ఉపయోగించుకోవాలి. కానీ.. సెజ్‌ ఏర్పాటై పదేళ్లయినా 229.66 ఎకరాలను మాత్రమే ఆ సంస్థ ఉపయోగించుకుంది. వైయస్ జగన్ మరో ముందడుగు, అత్యవసర సేవలు అందించే 108, 104 సర్వీసులను లాంచ్ చేసిన ఏపీ సీఎం, నేరుగా జిల్లాలకు వెళ్లనున్న వాహనాలు

ఒప్పందం మేరకు ఉపాధి కల్పించడంలో విఫలమైన అమరరాజా ఇన్‌ఫ్రా టెక్‌ ఉపయోగించుకోని రూ.60 కోట్లకుపైగా విలువైన 253.61 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఎకరానికి రూ .1.8 లక్షల మార్కెట్ విలువను చెల్లించి డిజిటల్ వరల్డ్ సిటీ / ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. టిడిపి నాయకుడి కుటుంబానికి చెందిన సంస్థకు చిత్తూరు జిల్లాలో దాదాపు ఒక దశాబ్దం క్రితం 483.27 ఎకరాల భూమిని కేటాయించారు.

అమరా రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకున్నందుకు టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించారు. "సగం భూమి అభివృద్ధి చేయబడింది మరియు మిగిలిన భూమిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో, భూమిలో కొంత భాగాన్ని తిరిగి తీసుకోవడం రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఇలాంటి చర్యలు కొనసాగితే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేరు, "వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వేధింపులను, రాజకీయ విద్వేషాలను ఆపాలి" అని టీడీపీ అధినేత నాయుడు అన్నారు.