AP Covid Update: మౌత్‌వాష్‌ చేసుకుంటే కరోనా 30 సెకన్లలోనే అవుట్, యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్ర్తవేత్తల పరిశోధనలో వెల్లడి, ఏపీలో తాజాగా 1,397 మందికి కోవిడ్
virus Spread (Photo Credit: IANS)

Amaravati, Nov 17: ఏపీలో తాజాగా 1,397 పాజిటివ్ కేసులు (AP Covid Update) నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా కరోనా వల్ల గడిచిన 24 గంటల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. తాజాగా వచ్చిన కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,56,159కి చేరిందని, మరణాల సంఖ్య 6,890కి (Covid Deaths) పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్‌ కేసులు కొనసాగుతున్నాయని, ఇక కరోనా బారి నుంచి 8,32,284 మంది రికవరీ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 92.64 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు పేర్కొన్నారు.

కరోనా కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌత్‌వాష్‌ (Mouthwash) వల్ల కరోనా వైరస్‌ 30 సెకన్లలోనే అంతమవుతుందని యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్ర్తవేత్తలు చేసిన పరిశోధన చెబుతోంది. 0.07% సెటీపెరిడినమ్‌ క్లోరైడ్‌ రసాయనం కలిగి ఉన్న ఏ మౌత్‌వాష్‌ అయినా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ప్రయోగశాలలో చేసిన పరిశోధనలో వెల్లడైంది. డెంటిల్‌ అనే బ్రాండ్‌ మౌత్‌వాష్‌ను ఉపయోగించి కార్డిఫ్‌ యూనివర్సిటీలోని ప్రయోగశాలల్లో పరిశోధన చేసిన శాస్ర్తవేత్తలు పై విషయాన్ని వెల్లడించారు.

దేశంలో 4 నెలల తరువాత తక్కువ కేసులు, తాజాగా 29,163 మందికి కోవిడ్, 82,90,370 మంది డిశ్చార్జి, 449 మంది మృతితో 1,30,519కు చేరుకున్న మరణాల సంఖ్య

ఈ మౌత్‌వాష్‌తో 12 వారాల పాటు ఫ్రొఫెసర్‌ డేవిడ్‌ థామస్‌ ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేశారు. ల్యాబ్‌లో చేసిన మా పరిశోధనల్లో మౌత్‌వాష్‌ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంది. కరోనా బాధితులపై అధ్యయనం చేసినపుడు ఏ విధంగా ఫలితం వస్తుందో చూడాల్సి ఉంది’ అని ఫ్రొఫెసర్‌ థామస్‌ అన్నారు. 2021 తొలినాళ్లలో జరగనున్న క్లినికల్‌ ట్రయల్స్‌లో కోవిడ్‌ బారిన పడిన వారు మౌత్‌వాష్‌ను ఉపయోగించడం వల్ల కలిగే లాభం, ప్రభావం ఎంతకాలం ఉంటాయో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఫలితాలు సానుకూలంగా వస్తే కరోనా కట్టడికి ప్రజలు ఇప్పటికే ఉపయోగిస్తున్న శానిటైజర్లు, మాస్కుల జాబితాలో మౌత్‌వాష్‌ కూడా చేరుతుందని ఆయన వివరించారు.