
Vizag, Feb 21: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో పూజ చేసేందుకు వెళ్లి ఆఇంటి యజమానురాలు మౌనిక అనే మహిళపై జ్యోతిష్యుడు అప్పన్న అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే పూజలు చేసి చంపేస్తానంటూ బెదింరించాడు.దీంతో ఆగ్రహంతో అప్పన్నను హత్య (Vizag Astrologer Murder Case) చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు దంపతులు.ఈ కేసు విషయాలను భీమిలి సీఐ బి.సుధాకర్ మీడియాకు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతిష్యుడు మోతి అప్పన్న భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్లతో కలిసి పెందుర్తి బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ఇక భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక దంపతులు ఆనంద పురం మండలం లొడగలవానిపాలెంలో నివాసముంటున్నారు. అక్కడ వారు టీ దుకాణం నడుపుతున్నారు.
అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. అలా పరిచయం కావడంతో తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఈ నెల 7న పూజల కోసం మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెతో అసభ్యకరంగా (misbehaving with his wife) ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు.
ఆమె జరిగిన దారుణాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. తనను ద్విచక్రవాహనంపై నేర్లవలస తీసుకెళ్తున్నట్లు నమ్మబలికాడు. ఈ నెల 9న కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపులుప్పాడ మార్గంలోని కల్లివాని ప్రాంతంలో ఎవ్వరూ లేని ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య ( Man stabs astrologer appanna) చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్లో చికిత్స తీసుకున్నాడు.
ఇక ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు ఈనెల 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద అస్థిపంజరం లభించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి, విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. ఇద్దర్నీ గురువారం అరెస్టు చేసి జైలుకి తరలించారు.
తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.