Krishna Water Tussle: ఏపీ- టీఎస్ నీటి పంచాయితీలో మరో మలుపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నిలిపివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఆదేశాలు
Krishna Water | Photo: Twitter

New Delhi, July 30:  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును వెంటనే నిలిపివేయాల్సిందిగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడాన్ని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు తప్పు పట్టింది. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యుడు హరికేశ్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక ఆదేశం పంపారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనుల విషయంలో కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వాన్ని బోర్డు హెచ్చరించింది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పునర్విభజన చట్టానికి విరుద్దమైందని చెబుతూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా వాటర్ బోర్డు ప్రతిస్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ లేఖ రాసింది.  ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులను నిర్మించడానికి వీల్లేదని పేర్కొంది.  ఆంధ్రప్రదేశ్  పునర్విభజన చట్టం సెక్షన్ 84, పేరా 7లోని నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేయడాన్ని  బోర్డు తప్పు పట్టింది.

కొత్త ప్రాజెక్టులేవైనా చేపడితే ముందుగా వాటి సమగ్ర నివేదిక (డీపీఆర్)ను కేంద్ర జలవనరుల సంఘానికి సమర్పించి, అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలైనా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని బోర్డు పేర్కొంది.

గతంలో లాగా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇప్పుడు ఎలాంటి గొడవలు లేనప్పటికీ, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతి కొనసాగుతోంది. ముఖ్యంగా కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాల్సిందిగా ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం నేరుగా ఎవరిపై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు.