Covid in TS: రాబోయే 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి, హెచ్చరించిన ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, రాష్ట్రంలో తాజాగా 1,050 పాజిటివ్‌ కేసులు, నలుగురు మృతి
Coronavirus in India (Photo Credits: PTI)

Hyderabad,Nov 14: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,002 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,050 పాజిటివ్‌ కేసులు (Coivd in Telangana) నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,56,713కి చేరింది. గత24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,401కి (Coronavirus Death Toll) చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

నిన్న ఒక్క రోజే 1,736 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,38,908కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 16,404 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 13,867 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 48,53,169కి చేరింది.

చలి తీవ్రతతో కరోనా తీవ్రంగా విజృంభించే అవకాశం ఉందని రాబోయే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హెచ్చరించారు. కరోనా టీకా సహా జనవరి, ఫిబ్రవరి నాటికి శాశ్వత వైద్య చికిత్స కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో రోజుకు 8 వేల నుంచి 9 వేల కరోనా కేసులు, 80 నుంచి 90 వరకు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. వాయు కాలుష్యం, చలి వల్ల ఢిల్లీలో వైరస్‌ తీవ్రత ఉందని వెల్లడించారు.

ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్..తోడయిన కాలుష్యం, దేశంలో తాజాగా 44,684 కొత్త కేసులు నమోదు, 87,73,479కు చేరిన మొత్తం కేసుల సంఖ్య, డిసెంబర్‌లో అందుబాటులోకి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్

అమెరికాలో 2 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. యూరప్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. బాధ్యతారహితంగా ఉన్నచోట వైరస్‌ ఉధృతి పెరుగుతోంది. 90 శాతం వైరస్‌ వ్యాప్తికి కారణం ముక్కు, నోరే.. కాబట్టి మాస్క్‌ను ఆ రెండూ కవరయ్యే లా చూడాలని తెలిపారు. రాబోయే కోవిడ్‌ టీకాలు కూడా ఏ మేరకు సమర్థంగా పనిచేస్తాయో స్పష్టత లేదు. కాబట్టి టీకా కోసం ఎదురుచూడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు.