TS Covid Report: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు, అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో తాజాగా 157 మందికి కోవిడ్ పాజిటివ్, నిర్ధారణ పరీక్షల సంఖ్యను 50 వేలకు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలు
Coronavirus in India (Photo-PTI)

Hyderabad, Mar 15: తెలంగాణలో కొత్త‌గా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 166 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,318కి (TS Coronavirus) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,681 మంది కోలుకున్నారు.

మృతుల సంఖ్య 1,654గా (covid Deaths) ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,983 మంది కరోనాకు (Covid) చికిత్స పొందుతున్నారు. వారిలో 718 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 35 మందికి క‌రోనా సోకింది. మరోవైపు.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 38,517 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 92,38,982కు పెరిగింది.

కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ర్టాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధా న పట్టణాలు గల జిల్లాలతోపాటు సరిహద్దు జిల్లాల్లోని వైద్యాధికారులను అప్రమత్తంచేసింది. శుక్రవారం వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం నిర్ధారణ పరీక్షల సంఖ్యను 50 వేలకు పెంచాలని ఆదేశించారు. ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్‌ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.

మళ్లీ డేంజర్ బెల్స్..నిన్న 25 వేలు కాగా నేడు 26 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలో చేయి దాటుతున్న పరిస్థితి, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

రాష్ట్రంలో ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు 26 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, కొన్నిచోట్ల కాస్తంత ఎక్కువగానే నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో ఈ నెల 8వ తేదీన 31 కరోనా కేసులుండగా, శనివారం ఒక్కరోజే 46 నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 8వ తేదీన 10 కేసులుంటే, శనివారం ఒక్కరోజు 15 కేసులకు పెరిగాయి.