Telangana Teachers: టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటన జీవోను  నిలిపివేసిన తెలంగాణ సర్కార్‌, వివాదాస్పద జీవోపై భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు, వెనక్కు తగ్గిన సర్కారు

టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై జీవోను తెలంగాణ సర్కార్‌ నిలిపివేసింది.  ఉపాధ్యాయులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రతి సంవత్సరం తమ ఆస్తుల వివరాలను సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. ఆస్తుల వివరాలను తెలియజేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

చరాస్తులు లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఉద్యోగులను కోరింది. రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్లు, రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నల్గొండ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ జావీద్‌ అలీపై ఆరోపణలు రావడంతో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

విద్యా శాఖ ఉద్యోగులు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యా శాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశించారు.