
Hyderabad, FEB 16: తెలంగాణలో ఈ వేసవికాలంలో ఎండలు మునుపటి కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023లో తెలంగాణలో ఎన్నడూలేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు అంతకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయట. ఈ వేసవి కాలంలో 48-49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని చెబుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే ఫిబ్రవరిలో ఎండలు మండిపడుతున్నాయి.
ఆగ్నేయం నుంచి వేడి గాలుల ప్రభావం వల్ల ఈ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉంటున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్, మేలోనూ ఇదే రీతిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
మార్చి, ఏప్రిల్లో ఉండే ఎండల తీవ్రతపై ఆ తదుపరి నెలలోని ఉష్ణోగ్రత పరిస్థితులు ఆధారపడి ఉంటాయంటున్నారు. వచ్చే నెల ఉష్ణోగ్రతలు 42-45 డిగ్రీల సెల్సియస్ నమోదు కావచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయని అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఇప్పటికే రాష్ట్రం ఉంది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు మరింత వేడి వాతావరణానికి మారిపోతోందని అధికారులు అంటున్నారు.
కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం జూన్ 9న కాజీపేటలో తెలంగాణ చరిత్రలోనే అధికంగా 48.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఉష్ణోగ్రతలు అధికంగా పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ముందస్తుగా యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సముద్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.