Huzur Nagar Bypoll: హుజూర్ నగర్ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్, 79 శాతానికి పైగా పోలింగ్ నమోదు, ఇంకా క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్న ఎన్నికల సిబ్బంది, పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం
EC Bans Exit Polls For Upcoming Assembly Elections, Bypolls On 21 October (Photo-Facebook)

Huzur Nagar, October 21: తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఉపఎన్నిక (By poll) హుజూర్ నగర్ (Huzur Nagar Assembly Constituency) స్థానానికి జరిగిన పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది, 5 గంటల వరకూ క్యూ లైన్ లో వేచి ఉన్నవారికి తమ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 వరకు 80 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

నియోజకవర్గంలో మొత్తం 2,36,842 మంది ఓట్లర్లు ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల కమీషన్ 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.  కాగా,  ఈ ఉపఎన్నికకు అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు,  అదే రోజు ఫలితం వెల్లడికానుంది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి (Sanampudi Saidireddy), మరో సారి తన అదృష్టం పరీక్షించుకోనుండగా, కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మా రెడ్డి (Nalamada Padmavathi Reddy) ఎలాగైనా మరోసారి ఈ స్థానాన్ని గెలుచుకోవాలని పట్టుదలగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా కూడా గెలవడంతో ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.  తెరాస- కాంగ్రెస్ మధ్య హోరా-హోరీ, హుజూర్ నగర్‌లో గెలుపెవరిది?

ఇక ఈ స్థానానికి బీజేపి నుంచి కోటా రామారావు, సీపీఎం తరఫున పారేపల్లి శేఖర్ రావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి సహా స్వతంత్ర అభ్యర్థులతో కలిపి మొత్తంగా 28 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. టెలివిజన్ పాత్రికేయులు 'తీన్మార్' మల్లన్న (నవీన్ కుమార్) కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీపడ్డారు. కాగా, ఈ ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉన్న సీపీఐ పార్టీ మొదటగా తమ మద్ధతును టీఆర్ఎస్ పార్టీకి ప్రకటించింది. అయితే టీఎస్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి వ్యతిరేకించి తమ మద్ధతు ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.