Telangana: ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్‌లు 30 శాతం పెంచుతూ కేసీఆర్ సర్కారు నిర్ణయం, పెరుగుతున్న కేసుల నేపథ్యంలో వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
CM KCR Press Meet Highlights (Photo-Twitter.CMO Telangana)

Hyd, Jan 6: తెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా వేల ఆశా వర్కర్లు అందించిన సేవలకుగాను అందిస్తున్న ఇన్సెంటివ్‌లను ( performance incentives for ASHA workers) పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు నెలవారీ ప్రోత్సాహకాలను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ.7500 నుంచి రూ.9750కి పెరగనున్నాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. పెంచిన ఇన్సెంటివ్‌లు గతేడాది జూన్‌ నుంచి వర్తిస్తాయని పేర్కొన్నది.

ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana govt ) కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంది. గడిచిన 24 గంటలలో తెలంగాణలో 1520 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తితోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా నమోదైన కేసుల్లో 40 శాతం ఒమిక్రాన్‌ బాధితులున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు. హైదరాబాద్‌లో నిన్న ఒక్కరోజే 979 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే థర్డ్‌వేవ్‌ వచ్చేసినట్లే అని అధికారులు ప్రజలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో అధికారులు బెడ్‌లను సిద్ధం చేస్తున్నారు.

కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, తెలంగాణలో ఒక్కరోజే 1,520 మందికి కరోనా, ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులు

ఆక్సిజన్‌ కొరత లేకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆసుపత్రులతో చేరిన వారిలో దగ్గు, జ్వరం లాంటి సాధారణ లక్షణాలు మాత్రమే ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. దాదాపు కోటి వరకు హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌లను కూడా పంపిణికి సిద్ధం చేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇంటింటికి వెళ్లి మరోసారి ఫీవర్‌ సర్వే చేయాలని అధికారులు భావిస్తున్నారు.