Hyderabad, October 20: తెలంగాణలో భారీ వర్షాలు ఒక వైపు, కొవిడ్ కేసులు మరోవైపు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో నిర్వహించే కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు తగినట్లుగా కేసుల సంఖ్యలో కూడా ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మునుపటికంటే తీవ్రత తగ్గిందనే చెప్పాలి.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 42,299 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1486 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 923 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 38,98,829 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,24,545కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 235 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 112, మేడ్చల్ నుంచి 102 కేసులు నిర్ధారణయ్యాయి.
మరోవైపు గత 24 గంటల్లో మరో 7 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1282కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 1891 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,02,577 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,686 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.