
Hyderabad, December 7: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్ధారించిన పరీక్షల మేరకు 33,098 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 517 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 644 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 58,12,588 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 273,858కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 102 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 57, మేడ్చల్ నుంచి 36, కరీంనగర్ నుంచి 33 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.


మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,474కు పెరిగింది.
అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 862 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 264,606 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,778 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.