SSC Exams Starts Today: తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు
తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు.
Hyderabad, April 3: తెలంగాణలో (Telangana) నేటి నుంచి పదో తరగతి (SSC Exams) వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు (Regular Students) 4,85,826 మంది. మొత్తం విద్యార్థుల్లో 78 శాతం మంది అంటే 3,78,794 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు కాగా, 98,726 మంది తెలుగు, 7,851 మంది ఉర్దూ, 235 మంది హిందీ, 137 మంది మరాఠీ, 83 మంది కన్నడ మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండగా, ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు.
హాల్ టికెట్లతో ఉచిత ప్రయాణం
‘పది’ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ కనుక జరిగితే అందుకు ఆయా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, ఎంఈవోలు, డీఈవోలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
(The above story first appeared on LatestLY on Apr 03, 2023 11:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

