Telangana: షాద్‌నగర్‌‌లో తీవ్ర విషాదం, గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి, ఈత రాక పోవడంతో అక్కడికక్కడే మరణించిన చిన్నారులు
Image used for representational purpose only | File Photo

HYd, Sep 26: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో (Shadnagar) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్‌ శివారులో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు (Three children drown ) మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన అక్షిత్ గౌడ్‌, ఫరీద్‌, ఫరీన్‌ ఈ ఉదయం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఓ చోట వెంచర్‌ కోసం వేసిన స్థలంలో నీరు నిలవగా.. అందులో చేపలు పట్టేందుకు దిగారు. ఈ క్రమంలో ఈత రాక మునిగిపోయి ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.

చిన్నారుల కోసం వెతుకుతూ అక్కడికి వచ్చిన వారి తల్లిదండ్రులకు మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. మృతిచెందిన చిన్నారుల వయసు పదేళ్లలోపే ఉంది. కుమారుల మృతితో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నీటి గుంత నుంచి మృతదేహాలను గ్రామస్థులు వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.