
Hyderabad, FEB 28: హైదరాబాద్లోని మణికొండలో భారీ అగ్ని ప్రమాదం (Manikonda Fire Accident) సంభవించింది. విద్యుత్ షాక్తో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ (Puppalguda) పాషా కాలనీలో ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్లో విద్యుత్ షాక్తో మంటలు చెలరేగాయి. షాపులో చెలరేగిన మంటలు కాస్త పక్కనే ఉన్న కారుకు వ్యాపించాయి. దీంతో కారులోని సిలిండర్ పేలి మొదటి అంతస్తు దాకా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలోనే మొదటి అంతస్తులోని ఫ్లాట్లో ఉన్న రెండు సిలిండర్లకు మంటలు అంటుకుని పేలాయి. దీంతో అదే ఇంట్లో ఉన్న జమీలా ఖాతూన్ (70), తహనా ఖాతూన్ (38), సిజ్రా ఖాతూన్ (07) మంటల్లో చిక్కుకుని.. అక్కడే సజీవ దహనమయ్యారు. అదే ఇంట్లో ఉన్న మరో 8 మంది మంటలకు భయపడి రెండో అంతస్తుకు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఇది చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, మంటలు ఎగిసిపడుతున్న సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు యూనిస్ ఖాన్ అనే వ్యక్తి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకాడు. దీంతో అతని కాలు విరిగిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాలను, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.