TS Inter Results 2022: జూన్ 25 తర్వాతే తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు, నేటి నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు ప్రారంభం
Exams Representational Image. |(Photo Credits: PTI)

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు జూన్‌ 20 (సోమవారం) నుంచి ప్రారంభంకానున్నట్లు ఇంటర్‌ బోర్డు (TSBIE) తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌ మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 20 నుంచి జులై 20 వరకు నెల రోజులపాటు కొనసాగుతుంది.

జూన్‌ 27 నుంచి జులై 20 వరకు మొదటి విడత ప్రవేశాలు చేపడతారు. అనంతరం జులై 1 నుంచి ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమవుతాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఫలితాలు త్వరలో విడుదలకానున్నాయి. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ సందర్శించి తెలుసుకోవచ్చు. పుకార్లకు చెక్.. జూన్ 25 తర్వాతే ఇంటర్ పరీక్షా ఫలితాలు, స్పష్టతనిచ్చిన ఇంటర్‌ బోర్డు, వాల్యూవేషన్ ప్రాసెస్ జరుగుతుందని వెల్లడి

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు (TS Inter Results 2022) వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన ఇంటర్ బోర్టు.. అందులో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.ఇటువంటి ప్రచారాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మవద్దని చెప్పింది. ఇప్పటివరకు ఫలితాల విడుదల తేదీని నిర్ణయించలేదని తెలిపింది. ఫలితాల విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 25 తర్వాతే ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఇంటర్ పరీక్షల పేపర్ కరెక్షన్ ముగియనున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పోస్టు వాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక, ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంట‌ర్‌ సెకండియ‌ర్‌ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెల్సిందే.