VSP Privatisation: విశాఖ ఉక్కుతో నీకేం పని అంటారా ? మేం ముందు భారతీయులమని తెలుసుకోండి, బీజేపీపై మండిపడిన తెలంగాణ మంత్రి కేటీఆర్, విశాఖ ఉక్కు దీక్షా శిబిరానికి మంత్రిని ఆహ్వానించిన ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు
Visakhapatnam, Mar 13: తెలంగాణ ఐటీ మంత్రి కె.తారక రామారావును విశాఖపట్నంలో ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరానికి పోరాట కమిటీ నాయకులు ఆహ్వానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి కేటీఆర్ (Telangana Minister KTR) మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, కో–కన్వీనర్ గంధం వెంకటరావు శుక్రవారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిశారు.
స్టీల్ప్లాంట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానం, చేస్తున్న ఉద్యమం గురించి ఆయనకు వివరించి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షా శిబిరాన్ని సందర్శించాలని కోరారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ప్లాంట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఉక్కు పరిరక్షణ పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేసినట్టు పోరాట కమిటీ నాయకులు (Visakha Steel plant union leaders) తెలిపారు. బడ్జెట్ సమావేశాల అనంతరం తాను విశాఖ వస్తానని చెప్పారన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని (VSP Privatisation) ఎందుకు అమ్ముతున్నరని అడిగితే విశాఖలో మీకేం పని అంటారా? ఏం విశాఖ భారత్లో లేదా.. మేం భారతీయులం కాదా? మాట్లాడొద్దా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. బీజేపీకి ఓటేస్తే ప్రైవేటీకరణకు మద్దతిచ్చినట్టేనని, ధరల పెరుగుదలను ప్రోత్సహించినట్టేనని మంత్రి హెచ్చరించారు. పెద్ద ఎన్నికలైతే సరిహద్దులో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పడం.. చిన్న ఎన్నికలైతే భైంసా అల్లర్లను సృష్టించడమే బీజేపీ ఎజెండా అని తెలిపారు. శుక్రవారం ‘తెలంగాణ జీవితం-సామరస్య విలువలు’ అనే అంశంపై హరితప్లాజాలో తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ పెడతామంటూ విభజనచట్టంలో హామీ ఇచ్చిన కేంద్రం మోసం చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ‘బయ్యారం దేవుడెరుగు. ఇప్పుడు విశాఖ ఉక్కుఫ్యాక్టరీని అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారంటే విశాఖలో నీకేం పని అంటారు. విశాఖ దేశంలో లేదా.. మాట్లాడొద్దా? ఈ దేశంలో మాకు హిస్సా లేదా? ఇయ్యాల నువ్వు అక్కడ అమ్ముతున్నావు. రేపు మా సింగరేణి మీద పడతారు. ఈసీఐఎల్ మీద పడతారు. ఇవాళ ఇతరులకు కష్టం వచ్చిందని మనం ఊరుకుంటే రేపు మనం కూడా ఇబ్బంది పడతాం. ఎవరికి కష్టమొచ్చినా అందరం కలిసికట్టుగా ఉండాలి’ అని తెలిపారు. మనమంతా ముందు భారతీయులం అని, తర్వాతే తెలంగాణ పౌరులమని చెప్పారు. దేశంలో ఎక్కడ తప్పుజరిగినా నిలదీయాలని సూచించారు. కేంద్రప్రభుత్వం వంద ప్రభుత్వరంగ సంస్థలను ఎలా అమ్మాలని ఆలోచిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మేము అమ్ముతున్నాం.. మీరు కూడా అమ్మండి’ అంటూ కేంద్రం సిగ్గులేకుండా రాష్ట్రాలకు సూచిస్తున్నదని ఆరోపించారు. ఐడీపీఎల్ను ఖతం పట్టించారని విమర్శించారు. ఇప్పుడు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను కొనుక్కోండంటూ రాష్ర్టానికే సలహాలిస్తున్నదన్నారు. ‘మా భూములను మీరు అమ్ముడేంది’ అని ప్రశ్నించారు.
(The above story first appeared on LatestLY on Mar 13, 2021 01:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

