Tamil Nadu soil For Moon Mission: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్లో తమిళనాడు మట్టిది కీలక పాత్ర, ప్రయోగానికి ముందు ల్యాండర్ ట్రయల్స్లో నమక్కల్ మట్టి ఉపయోగించిన ఇస్రో
నమక్కల్.. తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైకి దాదాపు 400 కి.మీల దూరంలో ఉన్న ఊరు ఇది. ప్రపంచానికి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ, భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి మాత్రం చాలా ముఖ్యమైన ప్రాంతమిది. జాబిల్లి అధ్యయనం కోసం ఇస్రో (ISRO) చేపట్టిన ప్రయోగాల్లో నమక్కల్ మట్టి (Namakkal Soil) కీలక పాత్ర పోషించింది.
Chennai, AUG 23: నమక్కల్.. తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నైకి దాదాపు 400 కి.మీల దూరంలో ఉన్న ఊరు ఇది. ప్రపంచానికి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ, భారత అంతరిక్ష పరిశోధన కేంద్రానికి మాత్రం చాలా ముఖ్యమైన ప్రాంతమిది. జాబిల్లి అధ్యయనం కోసం ఇస్రో (ISRO) చేపట్టిన ప్రయోగాల్లో నమక్కల్ మట్టి (Namakkal Soil) కీలక పాత్ర పోషించింది. చంద్రయాన్-3 (Chandrayaan-3) కోసం కూడా ఇక్కడి నుంచి మట్టిని సేకరించారు. ఆ మట్టి ఎందుకంత ప్రత్యేకమంటే..? దీన్ని ఎలా గుర్తించారంటే..? 2008లో చంద్రయాన్-1 విజయవంతమైన తర్వాత జాబిల్లిపై ఇస్రో (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న రోజులవి..! చంద్రయాన్-1 మిషన్ కేవలం జాబిల్లి కక్ష్యలో మాత్రమే తిరిగింది. కానీ, చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ లక్ష్యంగా చంద్రయాన్-2 మిషన్ను అభివృద్ధి చేశారు.
ల్యాండర్ మాడ్యూల్ (Lander module) జాబిల్లిపై అడుగుపెడితే.. అందులోని రోవర్ (Rover) బయటకు వచ్చి చంద్రుడిపై నడిచేలా ప్లాన్ చేశారు. అయితే చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ను ఎలా దించాలి? అక్కడ రోవర్ ఎలా నడవగలదు? అన్నదాన్ని పరీక్షించేందుకు ఇస్రో సిద్ధమైంది. కానీ, భూమి ఉపరితలం చంద్రుడి ఉపరితలం మాదిరిగా ఉండదు. మరి అప్పుడు అక్కడ దించేలా ల్యాండర్ను పరీక్షించడం ఎలా? ఇందుకోసం ఇస్రో అన్వేషణ సాగించింది. జాబిల్లి ఉపరితలంపై ఉండే మట్టి (soil) లాంటిది భూమిపై ఎక్కడైనా ఉందా? అని పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తమిళనాడులోని నమక్కల్ మట్టి వారి దృష్టిని ఆకర్షించింది. 2012లో తొలిసారి ఈ ప్రాంతం నుంచి 50 టన్నుల మట్టిని ఇస్రో సేకరించింది. దానికి పలు పరీక్షలు నిర్వహించగా.. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి లాంటి లక్షణాలు నమక్కల్ ప్రాంతంలోని మట్టిలో ఉన్నట్లు ఇస్రో ధ్రువీకరించిందని పెరియార్ యూనివర్సిటీలోని జియాలజీ విభాగ ప్రొఫెసర్ ఎస్. అన్బళగన్ తెలిపారు.
2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్లో నమక్కల్ మట్టితోనే ల్యాండర్, రోవర్ బుడిబుడి అడుగులను పరీక్షించారు. ఇప్పుడు తాజా చంద్రయాన్-3 ప్రయోగంలోనూ దీన్నే వినియోగించారు. దీనిపై అన్బళగన్ మాట్లాడుతూ.. ‘‘మేం భూగర్భ పరిశోధనలు చేస్తుండగా.. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మట్టి.. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి లాగే ఉన్నట్లు తెలిసింది. ప్రత్యేకించి దక్షిణ ధ్రువంపై ఉన్న మట్టితో ఇది పోలి ఉంటుంది. జాబిల్లి ఉపరితలంపై అనోర్థోసైట్ రకం మట్టి ఉంది. నమక్కల్ చుట్టుపక్కల గ్రామాలైన సీతంపూంది, కున్నమళై ప్రాంతాల్లో ఈ రకం మట్టి సమృద్ధిగా దొరుకుతుంది’’ అని తెలిపారు. ఇస్రో చేపట్టే భవిష్యత్తు ప్రయోగాలకు కూడా తాము ఇక్కడి నుంచి మట్టి పంపిస్తామని ఆయన అన్నారు.
(The above story first appeared on LatestLY on Aug 23, 2023 08:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

