![](https://test1.latestly.com/uploads/images/2025/02/30-199.jpg?width=380&height=214)
Mumbai, FEB 14: చైనా దిగుమతులపై విధించిన టారిఫ్ సుంకాలకు తోడు తాజాగా స్టీల్, అల్యూమినియం దిగుమతులపై సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటన అనిశ్చితికి దారి తీసింది. దేశీయంగా జ్యువెల్లర్లు, రిటైలర్లు కొనుగోళ్లు చేపట్టడంతో బంగారం ధర ధగధగ మెరుస్తున్నది. మరోవైపు, పెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారం ధర (Gold Price)రోజురోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.1,300 పెరిగి రూ.89 వేల మార్క్ను దాటేసి రూ.89.400 పలికింది. గురువారం ఇదే బంగారం (99.9 స్వచ్చత) తులం ధర రూ.88,100లకు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1,300 వృద్ధి చెంది రూ.89 వేలకు చేరుకుని ఆల్టైం రికార్డ్ (Gold All Time Record) నెలకొల్పింది. గురువారం రూ.87,700 పలికింది. మరోవైపు, శుక్రవారం కిలో వెండి ధర రూ.2,000 వృద్ధితో రూ. లక్ష పలికింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి రికార్డును నమోదు చేసింది. గురువారం కిలోవెండి ధర రూ.98 వేల వద్ద స్థిర పడింది.
‘మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఏప్రిల్ డెలివరీ తులం బంగారం ధర రూ.184 పుంజుకుని రూ.85,993 వద్ద ముగిసింది. డాలర్ ఇండెక్స్ బలహీన పడటంతోపాటు యూఎస్ టారిఫ్ విధానానికి మద్దతు లభించడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ బంగారం ధర 2,935 డాలర్లు పలికింది’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ వీపీ- రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. ఇక ప్రస్తుతం ఇన్వెస్టర్లు అమెరికా రిటైల్ సేల్స్, కోర్ రిటైల్ సేల్స్ డేటాపై దృష్టి కేంద్రీకరించారు.
సిల్వర్ ప్యూచర్స్ కిలో వెండి ఏప్రిల్ డెలివరీ ధర రూ.2,517 పెరిగి రూ.97,750 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2929.70 డాలర్లు పలికింది. వరుసగా మూడో రోజు కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్లో ఔన్స్ బంగారం ధర 2,960 డాలర్లకు దూసుకెళ్లింది. అంతర్జాతీయంగా ఏడు వారాలుగా బంగారం ధర పైపైకి దూసుకెళ్తున్నది. 2020 ఆగస్టు తర్వాత బంగారం ధర పెరగడం ఇదే తొలిసారి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్లో ఔన్స్ బంగారం ధర దాదాపు నాలుగు శాతం పుంజుకుని 34 డాలర్లు పలికింది.