
Sriharikota, March 02: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఏడాది జనవరిలో రెండు ఉపగ్రహాలను సక్సెస్ఫుల్గా అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను పూర్తిచేసిన ఇస్రో ఇప్పుడు ఈ ప్రయోగాలను మళ్లీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 15 నుంచి ఈ ప్రయోగాలు చేపట్టనున్నట్లు తాజాగా ఇస్రో చీఫ్ వీ నారాయణన్ (Narayan) చెప్పారు.యునిఫైడ్ ఉపగ్రహం ప్రస్తుతం దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉందని, వివిధ ప్రయోగాలు నిర్వహించడానికి ప్రతి రెండు నెలలకు 10 నుంచి 15 రోజుల విండో ఉంటుందని చెప్పారు. స్పాడెక్స్ ఉపగ్రహాలపై (Spadex Experiments) ప్రయోగాలు నిర్వహించడానికి మార్చి 15 నుంచి విండో అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
వాటిని విడదీసి, అనంతరం రీ డాకింగ్ చేస్తామని, ఇందుకు సంబంధించిన అనుకరణ ప్రయోగాలు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా ఉపగ్రహాల్లో ఇంధనం సరిపడా ఉందని తెలిపారు. త్వరలోనే పలు ప్రయోగాలు చేయబోతున్నట్లు చెప్పారు. రెండు నెలల అనంతరం మూడో దశ ప్రయోగాలు ఉంటాయని వివరించారు. రెండు ఉపగ్రహాల మధ్య విద్యుత్ శక్తి బదిలీని చేయడానికి ప్రణాళికలు వేసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి మొదట నుసిపురుగులను పంపే ప్రయత్నాల్లోనూ ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మనుషులకు వచ్చే వ్యాధులను ప్రభావితం చేసే అదే జన్యు లక్షణాలలో 75 శాతం నుసిపురుగుల్లో ఉంటుంది. అంతరిక్షంలో అవి ఎలా ప్రతిస్పందిస్తాయో అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం చేయనున్నారు.