Beirut Blasts: పేలుడు అంతా క్షణాల్లోనే..నెత్తురోడిన బీరూట్, 78 మంది మృతి, 4 వేల మందికి పైగా గాయాలు, తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ, ట్రంప్, బీరూట్‌ని శ్మశాన దిబ్బగా మార్చివేసిన అమోనియం నైట్రేట్‌
Lebanon Blast (Photo Credits: ANI)

Lebanon, August 5: లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడుతో (Beirut Explosion) నెత్తురోడింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ పేలుళ్లలో 70 మందికి పైగా చనిపోగా.. నాలుగు వేలమందికి పైగా గాయపడినట్లు లెబనాన్ అధ్యక్షుడు మికెల్ ఒవాన్ తెలిపారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో (Beirut Blasts) జనం వణికిపోయారు. వీధుల వెంట పరుగులు తీశారు. బీరూట్‌లో జ‌రిగిన అమోనియం నైట్రేట్ పేలుడుకు (Ammonium Nitrate Exploded) అక్క‌డి ఓడ‌రేవు మొత్తం ధ్వంస‌మైంది. పేలుడు తీవ్రత ఎంత ఉందంటే.. రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్‌లోనూ గాజు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

సుమారు 2750 ట‌న్నులు అమోనియం నైట్రేట్ ర‌సాయ‌నం పేల‌డం వ‌ల్ల .. బీరూట్‌లో అంత పెద్ద ప్ర‌మాదం (Lebanon Blast) జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఒక్క‌సారిగా ఆ భారీ మొత్తంలో ర‌సాయ‌నం పేలడంతో బీరూట్ న‌గ‌రం చిగురుటాకుల వ‌ణికిపోయింది. భారీ విస్పోట‌నం వ‌ల్ల న‌గ‌ర‌మంతా పొగ‌చూరింది. బీర‌ట్ న‌గ‌ర ఓడ‌రేవు వ‌ద్ద దాదాపు ఆరేళ్లుగా ఓ వేర్‌హౌజ్‌లో అమోనియం నైట్రేట్‌ను స్టోర్ చేయ‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

మొదటి పేలుడు సంభవించిన కాసేపటికే రెండో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించినంతగా ప్రమాద తీవ్రత ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పేలుడుతో ఆకాశమంతా అరుణ వర్ణంతో నిండిపోయింది. ఘటనాస్థలి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర భవనాలన్నీ ధ్వంసమయ్యాయి. పేలుళ్ల ధాటికి భూమి కంపించిందని, దీని తీవ్రత 3.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

Here's Blasts Videos

పేలుడు శబ్దాలు బీరూట్ కు 240 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దీవుల వరకూ వినిపించడం గమనార్హం. ఇది ఓ అణుబాంబు తీవ్రతను గుర్తు చేసిందని, నౌకాశ్రయం ప్రాంతంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మాక్రోవీ యర్గానియన్ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలను చూడలేదని ఆయన అన్నారు. 1975 నుంచి 1990 మధ్య పదిహేను సంవత్సరాల పాటు సివిల్ వార్ సాగినా, ఇంతటి పేలుళ్లు జరగలేదని అన్నారు.

బీరుట్ పేలుడు నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. అధ్యక్షుడు మైకేల్ ఔన్ అత్యవసర కేబినెట్ భేటీకి పిలుపునిచ్చారు. రెండు వారాల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. అన్ని అధికారిక కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. అధ్యక్షుడు, ప్రధాని సహా ప్రముఖులు తమ సాధారణ షెడ్యూల్ ను రద్దు చేసుకున్నారు. బాధితులను ఆదుకునేందుకు తక్షణం 100 బిలియన్ ఇరాలను తక్షణ సాయంగా ప్రభుత్వం విడుదల చేసింది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ప్రకటించారు.

Here's Blasts Videos

బీరూట్ ను శ్మశాన దిబ్బగా మార్చివేసిన అమోనియం నైట్రేట్‌ను వివధ రకాలుగా వాడుతున్నప్పటికీ ఎక్కువ శాతం ఈ రసాయ‌నాన్ని వ్య‌వ‌సాయ ఎరువుగా వాడుతుంటారు. దీంతో పాటు పేలుళ్లకు కూడా వినియోగిస్తారు. అమోనియం నైట్రేట్ చాలా ప్రమాదకరంగా నిపుణులు చెబుతున్నారు. ఆ ర‌సాయ‌నం వ‌ద్ద చిన్న అగ్గి ఛాయ‌లు ఉన్నా.. అది మ‌హాశ‌క్తివంతంగా పేలిపోతుంది. ఈ ర‌సాయ‌నం పేలిన‌ప్పుడు.. అత్యంత ప్రాణాంత‌క‌మైన వాయువులు విడుద‌ల అవుతాయి. అమోనియం నైట్రేట్ నుంచి విష‌పూరిత‌మైన నైట్రోజ‌న్ ఆక్సైడ్‌తో పాటు అమోనియా వాయువు కూడా రిలీజ్ అవుతుంది. దీంతో అది మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

అమోనియం నైట్రేట్ స్టోరేజ్ విష‌యంలో చాలా క‌ఠిన నిబంధ‌న‌లు ఉన్నాయి. స్టోరేజ్ సైట్ల‌ను అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ఉండేవిధంగా చూసుకోవాలి. అమోనియం నైట్రేట్‌ను స్టోరేజ్ చేసిన ప్రాంతంలో ఎటువంటి డ్రైనేజీలు, పైపులు, ఇత‌ర ప్ర‌వాహ వాహ‌కాలు ఉండ‌కూడదు. ఎందుకంటే ఆ పైపుల్లో ఒక‌వేళ అమోనియం స్టోర్ అయితే అప్పుడు ప్ర‌మాద తీవ‌త్ర మ‌రింత భ‌యంక‌రంగా ఉంటుంది.

బీరూట్ పేలుడుపై భారత ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీరుట్ నగరంలో పెద్ద పేలుడు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసింది. మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ పీఎంఓ కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది.

Here's PMO Tweet

లెబనాన్ రాజధాని బీరూట్‌ పేలుళ్ల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో లెబనాన్‌కు అమెరికా తోడుగా ఉంటుందని, ఎలాంటి సాయం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ట్రంప్‌.. డెబ్బై మందికి పైగా ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదాన్ని‘భయంకరమైన దాడి’లా కనిపిస్తోందన్నారు ఇది పేలుడు పదార్థాల తయారీ వల్ల సంభవించలేదని, బాంబు దాడి అని భావిస్తున్నట్లు తెలిపారు. తన యంత్రాంగంలోని కొంతమంది అత్యుత్తమ జనరల్స్‌తో మాట్లాడానని, వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని విలేకరులతో పేర్కొన్నారు.

ఈ విచారకర ఘటనపై అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ స్పందించారు. లెబనాన్‌ ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామంటూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

ఈఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ తన యజమాని బిడ్డను కాపాడేందుకు చేసిన సాహసం విశేషంగా నిలిచింది. పేలుడు సమయంలో ఆ ఇంటి పనిమనిషి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను కాపాడిన వీడియో చూస్తే గుండెలను పిండేస్తోంది.

ఇదిలా ఉంటే గత ఏడాది కాలంగా లెబనాన్‌లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి నెలకొంది. పేదరికం తారస్థాయికి చేరింది. నిత్యావసరాల కోసం ప్రజలు చెత్తకుప్పలు వెదికే పరిస్థితులు దాపురించాయి. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజధానిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం ప్రజల జీవితాలను మరింత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టింది.