Earthquake in Turkey: సముద్రంలో పెను భూకంపం, టర్కీ, గ్రీస్‌ దేశాలు విలవిల, 17 మంది మృతి, క్షతగాత్రులు 700 మందికి పైగానే, షాక్‌లో మరికొందరు, 7.0 తీవ్రతతో భూకంపం
Earthquake in Turkey (Photo Credits: ANI)

Istanbul, October 31: టర్కీ, గ్రీస్‌ దేశాల్లో శుక్రవారం భారీ భూకంపం (Earthquake in Turkey) సంభవించింది. టర్కీ తీరప్రాంతం, గ్రీస్‌ దీవి సమోస్‌ మధ్య ఏజియన్‌ సముద్రంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0గా నమోదైంది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్‌ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్‌ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు.

భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. ఈ భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. టర్కీలో 17 మంది చనిపోయారని, అందులో ఒకరు నీళ్లలో మునిగి చనిపోయారని, 709 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. భూకంపం ప్రభావం పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్‌ పట్టణంపై భారీగా పడింది. అక్కడ పలు భవనాలు నేల కూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించాయి. మృతుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది.

భవన శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కుప్పకూలిన భవనాల శిధిలాల నుంచి 70 మందిని రక్షించామన్నారు. భూమి 25 నుంచి 30 సెకన్ల పాటు కంపించిందని స్థానికుడొకరు తెలిపారు. 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా టర్కీలోని సెఫారిసర్‌లో స్వల్ప స్థాయిలో సునామీ వచ్చింది. గ్రీస్‌ ద్వీపం సామోస్‌లో సునామీ హెచ్చరిక జారీ చేశారు. సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి. భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి.

Here's Earthquake videos

టర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు.అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం సమోస్‌లోని గ్రీకు పట్టణం కార్లోవాసికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. టర్కీ యొక్క ఏజియన్ రిసార్ట్ నగరమైన ఇజ్మీర్ వద్ద భూకంపం వల్ల భారీ నష్టం సంభవించడంతో సహాయక చర్యలు సాగుతున్నాయి. టర్కీలో భూకంపం బాధితులకు అత్యవసర వైద్యం అందించేలా చూస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రో్ అదనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు.

టర్కీలోని మూడో అతిపెద్ద నగరం ఇజ్మిర్‌. ఇక్కడే భూకంపం ఎక్కువ విధ్వంసం ( Strong Quake Hits Izmir City) సృష్టించింది. ఇక్కడ 10కి పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయని, చాలా భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని ఇజ్మిర్‌ గవర్నర్‌ యువుజ్‌ సెలిమ్‌ కోస్గర్‌ తెలిపారు. సుమారు 12 భవనాల వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 38 అంబులెన్స్‌లు, రెండు హెలీకాప్టర్లు, 35 మెడికల్‌ టీమ్స్‌ సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. సెఫారిసర్‌లో వరదలు వచ్చిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Building collapses after massive earthquake hits

సామోస్‌ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్‌ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూరోపియన్‌–మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ ప్రకటించింది. భూకంప తీవ్రతను భూకంప లేఖినిపై ప్రాథమికంగా 6.9 గా నిర్ధారించింది. అయితే, అమెరికా జియోలాజికల్‌ సర్వే మాత్రం భూకంప తీవ్రతను 7.0 గా పేర్కొంది. 10 కిమీల లోతున మాత్రమే భూకంపం సంభవించినందున ప్రధాన భూకంపం అనంతర ప్రకంపనలు మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని గ్రీక్‌కు చెందిన భూకంప నిపుణుడు ఎకిస్‌ సెలెంటిస్‌ హెచ్చరించారు. వాటిలో కొన్ని శక్తిమంతమైన భూకంపాలు కూడా ఉండవచ్చని అంచనా వేశారు. భూకంప ప్రకంపనలు గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌తో పాటు బల్గేరియా వరకు విస్తరించాయి. టర్కీలో ఇస్తాంబుల్, మర్మరా, ఏజియన్‌ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.

అవసరమైన సమయంలో ఒకరికొకరు సహాయపడటానికి తమ విబేధాలను సైతం పక్కన పెట్టి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ జస్టిస్ బ్రైన్ చెప్పారు. టర్కీలో గతంలోనూ భూకంపాలు ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్నాయి.ఈ ఏడాది జనవరిలో ఇలాజిగ్‌ ప్రావిన్సు‌లో సంభవించిన భూకంపంలో 30మందికి పైగా మృతి చెందగా.. 1600మందికి పైగా గాయపడ్డారు. 1999లో ఇస్తాంబుల్‌ సమీపంలోని ఇజ్మిట్‌ నగరంలో వచ్చిన భూకంపంలో ఏకంగా 17వేలమంది కన్నుమూశారు. జూలై 2019లో సంభ‌వించిన భూకంపం దాటికి గ్రీకు రాజధాని ఏథెన్స్ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు విద్యుత్తు నిలిచిపోయింది. అదేవిధంగా 2011లో ఆగ్నేయ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం వల్ల 600 మందికి పైగా చనిపోయారు.

భవనాలు కూలుతున్న వీడియోలను, ఇండ్లల్లోకి సముద్రపు నీరు చేరుతున్న చిత్రాలను స్థానికులు సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. ధ్వంసమైన భవనాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయచర్యలు కొనసాగుతున్నాయి. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌సహా అనేక నగరాల్లో భూమి కంపించింది. టర్కీలో భూకంపంతో భవనాలు ఒక్కసారిగా ఊగిపోవటంతో ప్రజలు ప్రాణభయంతో ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

గ్రీకు ద్వీపం సమోస్‌కు ఉత్తరాన టర్కీ ఏజియన్ తీరాన్ని శుక్రవారం శక్తివంతమైన భూకంపం తాకింది. టర్కీలోని పశ్చిమతీర ప్రాంతానికి 17 కిలోమీటర్ల దూరంలోని ఇజ్మీర్‌ ప్రావిన్స్‌లోని ఇజ్మీర్‌ నగరంతోపాటు రాజధాని ఇస్తాంబుల్‌, గ్రీస్‌లోని ఏథెన్స్‌ నగరాలు ప్రకంపనల ధాటికి వణికిపోయాయి. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0గా నమోదైంది. భూకంపం కారణంగా సుమారు 20 బ‌హుళ అంత‌స్థుల‌ భవనాలు కూలిపోయిన‌ట్లు ఇజ్మీర్ మేయర్ టంక్ సోయర్ తెలిపారు. ట‌ర్కీలోనే 4.5 మిలియ‌న్ల నివాసితులతో మూడ‌వ అతిపెద్ద న‌గ‌రంగా ఇజ్మీర్ ఉన్న‌ట్లు ఆ దేశ మంత్రి సెలేమాన్ సోయులు వెల్ల‌డించారు. శ‌క్తివంత‌మైన అల‌ల ధాటికి సముద్ర‌నీరు రోడ్ల‌పైకి వ‌చ్చింది. అదేవిధంగా గ్రీస్‌లోని స‌మోస్ తీర‌ప్రాంతాల్లో నివ‌సిస్తున్న సుమారు 45 వేల మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాల్సిందిగా గ్రీస్ భూకంప నిరోధక ప్రణాళిక సంస్థ అధినేత ఎఫ్టిహ్మియోస్ లెక్కాస్ సూచించారు. బాధిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు. ఆస్తి, ప్రాణ న‌ష్ట తీవ్ర‌త తెలియాల్సి ఉంది.