G20 Summit 2022: శాంతి కోసం ప్రపంచ నేతల సహకారం అవసరం, జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రసంగం
ఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. వారిద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ట్విటర్లో షేర్ చేసింది.
Bali, Nov 15: ఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ఆత్మీయత వెల్లివిరిసింది. వారిద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ట్విటర్లో షేర్ చేసింది. బాలిలో జరుగుతోన్న జి-20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్ మధ్య ఆత్మీయ సంభాషణ చోటుచేసుకుంది’ అని పీఎంఓ పేర్కొంది.
ప్రపంచ ఆర్థిక వృద్ధిని తిరిగి పట్టాలెక్కించడం సహా ఇంధన, ఆహార భద్రత వంటి అంతర్జాతీయ అంశాలపై జరుగుతున్న ఈ సదస్సులో (G20 Summit 2022) భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మీద కీలక ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ పరిణామంపై స్పందించిన ప్రధాని.. కాల్పుల విరమణ, దౌత్యవేత్తం దిశగా ప్రపంచం ఓ మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
గత శతాబ్దంలో.. రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ విధ్వంసానికి కారణమైంది. ఆ తర్వాత.. శాంతి బాట పట్టేందుకు అప్పటి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ సమయంలో ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రతను నిర్ధారించడానికి.. ఖచ్చితమైన, సామూహిక సంకల్పాన్ని ప్రదర్శించడం అవసరం. వచ్చే ఏడాది బుద్ధుడు, గాంధీల పవిత్ర భూమిలో(భారత్లో జరగబోయే సమావేశాన్ని ఉద్దేశించి..) G20 సమావేశమైనప్పుడు.. మనమంతా ప్రపంచ శాంతి అనే బలమైన సందేశం తెలియజేయడానికి అంగీకరిస్తామని నేను విశ్వసిస్తున్నా.. అంటూ ఆయన సలహా పూర్వక ప్రసంగం కొనసాగించారు.
ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు, కరోనా లాంటి పరిణామాలు ప్రపంచ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం చూపెట్టాయని, ప్రపంచం మొత్తం మీద ఈ సంక్షోభం కొనసాగుతోందని, ముఖ్యంగా దాదాపు అన్ని దేశాల్లో పేదలకు పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని భారత ప్రధాని మోదీ అన్నారు. ఇక భారత్లో ఆహార భద్రతను ప్రస్తావించిన ప్రధాని మోదీ.. రాబోయే రోజుల్లో ఫెర్టిలైజర్స్ కొరత.. ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభావవంతమైన గ్లోబల్ బ్లాక్ భారత్ తరపున.. అన్ని ముఖ్యమైన సమస్యలపై ప్రపంచ ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కృషి చేయడం జరుగుతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇక వచ్చే ఏడాది భారత్ సారథ్యంలో జీ20 సదస్సు జరగనుంది. ‘ఒకే భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు’ (వసుధైవ కుటుంబం) ప్రధాన నినాదంగా ఉండబోతోందని పేర్కొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడి నుంచి జీ 20 సారథ్య బాధ్యతలు భారత్ స్వీకరించనుండటాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.
(The above story first appeared on LatestLY on Nov 15, 2022 12:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

