‘Pakistan Has Learned Its Lesson’: భారత్తో యుద్దాలు చేసి చాలా నష్టపోయాం, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు, శాంతి కోసం ప్రధాని మోదీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి
ఆర్థిక సంక్షోభంలో నలిగిపోతున్న పాకిస్థాన్ (Pakistan).. తమకు సహాయం చేయాలని ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు.
Islamabad, Jan 17: ఆర్థిక సంక్షోభంలో నలిగిపోతున్న పాకిస్థాన్ (Pakistan).. తమకు సహాయం చేయాలని ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల వల్ల గుణపాఠాలు (Pakistan Has Learned Its Lesson) నేర్చుకున్నామని, ఇప్పుడు ఆ దేశంతో శాంతి ఆకాంక్షిస్తున్నామని (Shehbaz Sharif Offers India) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.
అల్ అరేబియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోదీతో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, పాక్కు శాంతి కావాలని, కానీ కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలను ఆపాలని షెహబాజ్ కోరారు. కశ్మీర్ అంశం నిత్యం రగిలేదని, అలాంటి అంశాలపై కూర్చుని మాట్లాడుకోవాలని, భారత ప్రధానితో ఆ చర్చలు ఆశిస్తున్నట్లు షెహబాజ్ తెలిపారు.
భారత్తో (India) మూడు యుద్ధాలు చేశామని, కానీ ఆ యుద్ధాల వల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగినట్లు ఆయన వెల్లడించారు. మేం గుణపాఠం నేర్చుకున్నామని, ఇప్పుడు ఇండియాతో శాంతి కాంక్షిస్తున్నామని, మన సమస్యల్ని పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. తమ వద్ద ఇంజినీర్లు, డాక్టర్లు, నైపుణం ఉన్న కార్మికులు ఉన్నారని, దేశ సౌభాగ్యం కోసం వాళ్లను వాడుకోవాలని, ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి కోసం ఆ చర్యలు తప్పవని, రెండు దేశాలు కూడా పురోగమిస్తాయని షరీఫ్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. బాంబులు, ఆయుధాల సేకరణ కోసం తమ నిధుల్ని వృధా చేయాలని లేదని పాక్ ప్రధాని వెల్లడించారు.
మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్ తమ పౌరులకు కనీస నిత్యావసర వస్తువులను కూడా సబ్సిడీ కింద అందించలేకపోతోంది. ఇతర వస్తువుల ధరలు రికార్డు స్థాయిలో పెరగడమే కాకుండా గోధుమ పిండి కోసం ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి. మరోపక్క తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) నుంచి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇలా వివిధ రూపాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్న పాకిస్థాన్కు.. విదేశాల నుంచి సహాయం మాత్రం అంతంతగానే అందుతోంది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో శాంతిపేరుతో భారత్తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ పత్రిక ద ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కూడా మోదీ పల్లవి ఎత్తుకుని ఆశ్చర్యపరిచింది.ఇతరులను ప్రభావితం చేసే స్థాయికి భారత్ ను నిలబెట్టారని ప్రధాని నరేంద్ర మోదీని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ ఓ కాలమ్ రూపంలో ప్రశంసించింది.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయంగా విస్తరిస్తున్న తీరును కాలమ్ లో ప్రస్తావించింది. ‘‘ప్రధాన మంత్రి మోదీ సారథ్యంలో భారత విదేశాంగ విధానం ఎంతో నైపుణ్యవంతంగా ఉంది. భారత జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది’’ అని పేర్కొంది. దీన్ని చిరస్మరణీయ అభివృద్ధిగా.. రాజకీయ, భద్రత, రక్షణ రంగ విశ్లేషకుడు అయిన షాజాద్ చౌదరి ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కాలమ్ లో పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు భారత్ ప్రాధాన్య పెట్టుబడుల క్షేత్రంగా మారినట్టు చెప్పారు.
విదేశాంగ విధానంలో భారత్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. వ్యవసాయంలో ఎకరా దిగుబడి ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా చౌదరి పేర్కొన్నారు. భారత దేశ పాలనా వ్యవస్థ కాల పరీక్షను తట్టుకుని నిలబడినట్టు చెప్పుకొచ్చారు. దృఢమైన ప్రజాస్వామ్యానికి కావాల్సిన కనీస పునాదులు ఎంత బలంగా ఉన్నాయో నిరూపించుకున్నట్టు తెలిపారు. బ్రాండ్ ఇండియాకు ఇంతకుముందు మరెవరూ చేయలేని విధంగా మోదీ కృషి చేసినట్టు ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ కాలమ్ లో చౌదరి రాశారు.
ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నో సందర్భాల్లో ప్రశంసించడం గుర్తుండే ఉంటుంది. ప్రధాని పదవిలో ఉన్నప్పుడు, పదవీచ్యుతుడు అయిన తర్వాత కూడా ఆయన బహిరంగ సభల్లో నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 17, 2023 03:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

