Russia-Ukraine Conflict: బిక్కు బిక్కుమంటున్న భారతీయులు, ఉక్రెయిన్‌లో గడ్డకట్టే చలిలో భారతీయుల నిస్సహాయత, వెంట‌నే బాంబు షెల్ట‌ర్ల‌లోకి వెళ్లిపోవాల‌ని కోరిన భార‌త రాయ‌బార కార్యాల‌యం
Russia-Ukraine Conflict (Representative image)

New Delhi, February 24: రష్యా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో అక్కడ భారతీయులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఉక్రెయిన్‌లో గంట గంట‌కూ ప‌రిస్థితులు (Russia-Ukraine Conflict) మారిపోతున్న నేప‌థ్యంలో అక్క‌డి భార‌త రాయ‌బార కార్యాల‌యం కూడా అప్ర‌మ‌త్త‌మ‌వుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డ నివ‌సిస్తున్న భార‌తీయుల‌ను అల‌ర్ట్ చేస్తూనే వుంది. ఇప్ప‌టికే రెండు మార్లు త‌గు స‌ల‌హాలిచ్చింది. తాజాగా మూడో స‌ల‌హా (Issues Fresh Advisory) కూడా ఇచ్చింది.

ఎయిర్ సైర‌న్లు, బాంబు వార్నింగ్‌లు ఇచ్చే ప్రాంతంలో గ‌న‌క ఉంటే… వెంట‌నే బాంబు షెల్ట‌ర్ల‌లోకి వెళ్లిపోవాల‌ని ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌కు భార‌త ఎంబ‌సీ (Indian Embassy in Ukraine) సూచించింది. గూగుల్ మ్యాప్ స‌హాయంతో ద‌గ్గ‌ర్లో ఉన్న బాంబు షెల్ట‌ర్ల‌లోకి వెళ్లిపోవాల‌ని సూచించింది. భార‌తీయులు సుర‌క్షితంగా ఉండ‌డానికి తాము త‌గు ప్ర‌యత్నాలు చేస్తూనే వున్నామ‌ని, భార‌తీయులంద‌రూ ధైర్యంతో విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవాల‌ని ఉక్రెయిన్‌లో భార‌త రాయ‌బారి పార్థా స‌త్ప‌తి కోరారు. ఉక్రెయిన్‌లో ప్ర‌స్తుతం మార్షియ‌ల్ లా అమ‌లులో వుంద‌ని, అందుకే భార‌తీయుల త‌ర‌లింపులో ఇబ్బందులున్నాయ‌ని భార‌త ఎంబ‌సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఎక్కడివారు అక్కడే ఉండండి, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌‌కు ఎవరూ రావొద్దు, ఉక్రెయిన్‌లోని భారతీయులకు సూచించిన ఇండియన్‌ ఎంబసీ

దయచేసి మీ పరిసరాల గురించి తెలుసుకుని సురక్షితంగా ఉండండి. అవసరమైతే తప్ప మీ ఇళ్లను విడిచిపెట్టవద్దు. ఉక్రెయిన్ యుద్ధ చట్టాలు గురించి మీకు తెలుసు అందువల్ల మీ పత్రాలను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లండి అని రాయబార కార్యాలయం సూచించింది. కైవ్‌లో బస చేయడానికి స్థలం లేకుండా చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షిత ప్రాంతంలో ఉంచడానికి మిషన్ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాయబార కార్యాలయం వెలుపలికి వచ్చారని, అయితే వారందరికీ ఎంబసీ ప్రాంగణంలో వసతి కల్పించలేదని పేర్కొంది. అయితే వారి కోసం సమీపంలోని సురక్షిత ప్రాంగణాలను ఏర్పాటు చేసినట్లు ఎంబసీ వెల్లడించింది. కైవ్‌లోని గ్రౌండ్ పరిస్థితిని బట్టి ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టిందని కూడా తెలిపింది. అంతేకాదు ఉక్రెయిన్‌లోని విద్యార్థులతో సహా భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం కొనసాగిస్తోంది అని రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.

Here's Videos

ఉక్రెయిన్ త‌న గ‌గ‌న త‌లాన్ని మూసేయ‌డంతో ప్ర‌త్యేక విమానాలు ర‌ద్ద‌య్యాయ‌ని, ప్ర‌త్యామ్నాయ మార్గాల కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని అక్క‌డి ఎంబ‌సీ స్ప‌ష్టం చేసింది. వాటిపైనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, అవి ఓ కొలిక్కి రాగానే ప్ర‌క‌టిస్తామ‌ని అధికారులు పేర్కొన్నారు. భార‌తీయులంద‌రూ ప‌శ్చిమ ఉక్రెయిన్ వైపు వెళ్లిపోవాల‌ని సూచించారు. ఈ స‌మ‌యంలో పాస్‌పోర్టుల‌తో పాటు అత్య‌వ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను కూడా త‌మ ద‌గ్గ‌ర ఉంచుకోవాల‌ని ఉక్రెయిన్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌య వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. ‘ఉక్రెయిన్‌లోని ప‌రిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ద‌య‌చేసి స‌హ‌నంతో ఉండండి. ఎక్క‌డి వారు అక్క‌డే ఉండిపోండి. మీ మీ ఇళ్ల‌ల్లోనే త‌ల‌దాల్చుకోండి.’ అంటూ భార‌త విదేశాంగ శాఖ అక్క‌డి వారికి సూచించింది.

ఈ మేరకు ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రియాంక చతుర్వేది, మనీష్ తివారీతో సహా పలువురు రాజకీయ నాయకులు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ..ఎంబీసీ వద్ద ఉన్న విద్యార్థులకు కనీసం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను అభ్యర్థిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.