Russia-Ukraine War: ఉక్రెయిన్ వదిలి వెంటనే వెళ్లిపోండి, భారతీయులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఎంబసీ, 4 నగరాల్లో మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన రష్యా
రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్పై మాస్కో దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి.రెండు దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్నది. రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ వ్యాప్తంగా క్రెమ్లిన్ సేనల దాడులు కొనసాగుతున్నాయి.
Kyiv, Oct 20: రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్ వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్పై మాస్కో దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి.రెండు దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్నది. రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ వ్యాప్తంగా క్రెమ్లిన్ సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను విడిచిపెట్టి పోవాలని (leave Ukraine ‘at the earliest’) ఇండియన్ ఎంబసీ భారతీయులకు (Embassy asks Indians) సూచించింది.
పరిస్థితులు మళ్లీ తీవ్రంగా మారడంతో కీవ్లోని భారత దౌత్య కార్యాలయం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్లో ఇంకా భారతీయులెవరైనా ఉంటే.. వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు బుధవారం రాత్రి అడ్వైజరీ విడుదల చేసింది. ఉక్రెయిన్లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులెవరైనా ఇంకా ఉక్రెయిన్లోనే ఉంటే సాధ్యమైనంత త్వరగా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’’ అని ఎంబసీ అడ్వైజరీలో సూచించింది.
రెండు వారాల క్రితం రష్యా-క్రిమియాను కలిపే కీలకమైన కెర్చ్ వంతెనపై భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. వంతెన పేల్చివేతకు ఉక్రెయినే కారణమని ఆరోపిస్తోన్న మాస్కో.. నాటి నుంచి కీవ్పై ప్రతిదాడులను పెంచింది. దేశవ్యాప్తంగా క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అయితే, ఈ యుద్ధంలో మాస్కో అణ్వాయుధాలను ఉపయోగించే ముప్పు ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పలు దేశాలు భయపడుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్లో నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది.
మార్షల్ లా అంటే ఏమిటి ?
రష్యా చట్టాల ప్రకారం మార్షల్లా విధించిన ప్రాంతంలో సైన్యం, లాఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారాలు విస్తృతమవుతాయి. సైన్యం నేరుగా ఇక్కడ కర్ఫ్యూలు విధించగలదు. అంతేకాదు.. ప్రజల కదలికలను కూడా నియంత్రించే అవకాశం లభిస్తుంది. పౌరుల ఆస్తులను స్వాధీనం చేసుకొనే హక్కు సైన్యానికి లభిస్తుంది. కమ్యూనికేషన్లపై పూర్తి నిఘా పెట్టొచ్చు. దెబ్బతిన్న నగరాలను పునర్నిర్మించమని పౌరులను ఆదేశించొచ్చు. ‘‘మార్షల్ లా విధించడం అంటే సాధారణ ఆర్థిక వ్యవస్థ నిర్వహణను, చట్టాలను సస్పెండ్ చేయడమే’’ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఐరోపా ప్రోగ్రాం డైరెక్టర్ మాక్స్ బెర్గ్మన్ వెల్లడించారు. పౌరుల ఆస్తులు, భవనాలను సైన్యం స్వాధీనం చేసుకోవచ్చు. అంతేకాదు.. అక్కడ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన ఆదేశాలు ఇవ్వొచ్చు. ఇదిలా ఉంటే రష్యా ఆధీనంలో ఉన్నాయని చెబుతున్న నాలుగు దొనెట్స్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జపోరిజియా ప్రాంతాలు పూర్తిగా రష్యా ఆధీనంలో లేవు. దీంతో ఈ ప్రాంతాలపై పూర్తిస్థాయిలో మార్షల్లా ఎలా అమలు చేయగలదనే దానిపై సందేహాలు ఉన్నాయి.
(The above story first appeared on LatestLY on Oct 20, 2022 05:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

