Typhoon Hagibis: జపాన్ దేశాన్ని వణికిస్తున్న హగిబిస్ తుఫాన్, ఇప్పటివరకు 44 మంది మృతి, మిస్సయినవారు మరికొందరు, రంగంలోకి దిగిన లక్షల మంది సైనికులు, మృతులకు సంతాపం తెలిపిన భారత ప్రధాని నరేంద్ర మోడీ
Typhoon Hagibis death toll in Japan climbs to 42 after storm unleashes widespread flooding (Photo-Twitter)

Tokyo: తూర్పు ఆసియాలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అందమైన ద్వీపం జపాన్ ఇప్పుడు వణికిపోతోంది. పసిఫిక్ మహాసముద్రంలో తరచూ భూకంపాల ప్రభావానికి గురయ్యే జపాన్‌ను 1958 తర్వాత అత్యంత తీవ్రస్థాయిలో హగిబిస్‌ టైఫూన్ వణికిస్తోంది. రాజధాని టోక్యో సహా పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.గంటకు 216 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. టైఫూన్‌ ధాటికి 44 మంది మృతిచెందగా.. 20 మంది జాడ తెలియకుండా పోయింది. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. చికుమా నది పొంగిపొర్లడంతో సెంట్రల్‌ జపాన్‌లోని నాగానో సహా పరిసర ప్రాంతాలు నీటమునిగాయి.

దాదాపు 3 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. బుల్లెట్ రైళ్లతోపాటు పలు రైళ్లు, విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. 1,35,000 మంది ప్రజలు ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.

గంటకు 216 కి.మీ. వేగంతో బలమైన గాలులు

తుఫాన్ బాధితులను రక్షించడానికి 31 వేల సహాయక బృందాలతో పాటు మరో లక్షమంది సైనికులు రంగంలోకి దిగారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను హెలికాఫ్టర్లు, పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ నేపథ్యంలో రగ్బీ ప్రపంచ కప్ టోర్నమెంటును అధికారులు రద్దు చేశారు. మధ్య జపాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చికుమా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదీ పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. తుపాను ధాటికి జపాన్‌లోని హోన్షు ద్వీపం తీవ్రంగా దెబ్బతింది. ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జపాన్‌ ప్రధాని షింజో అబేతెలిపారు. టైఫూన్‌ మృతులకు భారత ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు.

టైఫూన్‌ మృతులకు భారత ప్రధాని మోడీ సంతాపం

1958లో టోక్యోలో సంభవించిన తుఫాన్‌కు హగిబిస్‌కు దగ్గరి పోలిక ఉన్నదని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తుఫాన్ కారణంగా 5 లక్షల ఇండ్లు నేలమట్టమయ్యాయని, 1,200 మందికిపైగా చనిపోయారని వారు గుర్తుచేశారు. రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అత్యవసర ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.

హగిబిస్‌ ఎఫెక్ట్

మరోవైపు, జపాన్‌‌లో సహాయక చర్యలకు చేయూతనివ్వడానికి భారత్ ముందుకొచ్చింది. తక్షణ సాయంగా రెండు పడవలతో సామాగ్రి, సహాయక సిబ్బందిని పంపింది. జపాన్‌కు సాయం అందించేందుకు భారత నౌకాదళం ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్ కిల్టన్‌ను ఆ దేశానికి తరలించింది. కాగా, హగిబిస్ తుఫాన్ మృతులకు ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు.