UK Horror: యూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్సన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసి అనంతరం ఆ మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్లో దాచాడు ఓ కసాయి కొడుకు. ఆపెన్షన్ డబ్బులతో జల్సాలు చేసి ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. 'ది మెట్రో' కథనం ప్రకారం.... కన్నతల్లి మరణించిన విషయాన్ని అధికారులకు తెలియజేయకుండా దాచిపెట్టి, ఆమె మృతదేహాన్ని దాదాపు మూడేళ్లపాటు ఇంట్లోని ఫ్రీజర్లో భద్రపరిచాడు. తల్లి పేరుతో వచ్చే పెన్షన్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను అక్రమంగా పొందిన సదరు నిందితుడికి బ్రిటన్ కోర్టు రెండేళ్లకు పైగా జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
సౌత్ వేల్స్లోని పోర్త్కాల్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన అక్కడి వాసులను షాకింగ్ కు గురి చేసింది.. క్రిస్టోఫర్ ఫిలిప్స్ (60) అనే వ్యక్తి తన తల్లి సిల్వియా ఫిలిప్స్తో కలిసి నివసిస్తున్నాడు. సిల్వియా ఫిలిప్స్ మార్చి 2023లో మరణించారు. అయితే, ఆమె మరణవార్తను బయటకు తెలపని క్రిస్టోఫర్.. మృతదేహాన్ని ఇంట్లోని ఒక చెస్ట్ ఫ్రీజర్లో దాచిపెట్టాడు. ఆ తర్వాత కూడా ఆమె పేరుతో ప్రభుత్వం నుంచి వచ్చే స్టేట్ పెన్షన్, సంక్షేమ పథకాల సొమ్ముతో పాటు బ్యాంకు ఖాతాల్లోని డబ్బును అక్రమంగా పొందుతూ వచ్చాడు. ఈ రకంగా అతడు సుమారు 78,190 పౌండ్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. కోటి) కాజేసినట్లు నిర్ధారణ అయింది.
దాదాపు మూడేళ్ల తర్వాత ఫిబ్రవరి 2026లో సిల్వియా ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్రిస్టోఫర్ ఇంటికి వెళ్లి విచారించగా, తన తల్లి లండన్లోని బంధువుల వద్దకు వెళ్లిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఇల్లు తనిఖీ చేయడంతో ఫ్రీజర్లో భద్రపరిచిన మృతదేహం బయటపడింది.
న్యాయస్థానంలో విచారణ సందర్భంగా.. నిందితుడి తరఫు న్యాయవాది వాదిస్తూ.. క్రిస్టోఫర్ చాలా కాలంగా తల్లికి కేర్టేకర్గా ఉన్నాడని, ఆమె మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడితోనే మృతదేహాన్ని వదులుకోలేక ఫ్రీజర్లో ఉంచాడని తెలిపారు. అయితే వాదనలు విన్న న్యాయమూర్తి ట్రేసీ లాయిడ్-క్లార్క్ ఈ క్రూరమైన చర్యను తీవ్రంగా పరిగణించారు. చట్టబద్ధమైన అంత్యక్రియలకు అడ్డంకి కలిగించడం.. ప్రభుత్వ సొమ్మును మోసపూరితంగా కాజేయడం వంటి తీవ్ర నేరాల కింద క్రిస్టోఫర్కు రెండేళ్ల నాలుగు నెలల జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.