BA Raju Passes Away: తెలుగు చిత్ర సీమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత బీఏ రాజు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు
BA Raju Passes Away (Photo-Twitter)

తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత బీఏ రాజు హఠాన్మరణం (BA Raju Passes Away) చెందారు. గతకొద్ది రోజులుగా మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. నాలుగున్నర దశాబ్ధాలుగా సినీ రంగంలో రాణిస్తున్న ఆయన (Senior journalist BA Raju) సినీ పత్రిక సూపర్‌హిట్‌ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. స్టార్‌ హీరోలకు, వందలాది చిత్రాలకు బీఏ రాజు పీఆర్వోగా పనిచేశారు. ఆయన భార్య జయ దర్శకత్వంలో పలు చిత్రాలు కూడా నిర్మించారు. ఆయన మరణంతో టాలీవుడ్ ఆవేదనలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు  దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఆయ‌న మృతి ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. బీఏ రాజు పేరు తెలియ‌ని వ్య‌క్తి సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌ర‌ని ఆయ‌న చెప్పారు. మ‌ద్రాసులో ఉన్న‌ప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయ‌న త‌న‌తో షేర్ చేసుకునే వార‌ని అన్నారు. ప్ర‌తి కొత్త విష‌యాన్ని ఆయ‌న నుంచి తెలుసుకునే వాడిన‌ని చెప్పారు. షూటింగ్ స్పాట్‌లోకి వ‌చ్చి త‌నతో ఆయ‌న చాలా స‌ర‌దాగా ముచ్చ‌టిం‌చేవార‌ని తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.

నటి పావలా శ్యామలకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అందుతున్న సహాయం, ఇప్పటికే చెక్కులు అందజేసిన పలువురు సినీ ప్రముఖులు, ఆనందం వ్యక్తం చేసిన హాస్య నటి

నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగంలో ఉన్న ఆయనతో అనుబంధాన్ని పలువురు సెలబ్రిటీలు గుర్తుచేసుకుంటున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని సోషల్‌ మీడియాలో ఎమోషన్‌ అయ్యాడు.‘‘బీఏ రాజుగారు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. ఆయనతో చాలా దగ్గరగా పనిచేశాను. సినీ పరిశ్రమలో ఆయనకొక జెంటిల్‌మ్యాన్‌. నిబద్ధతతో పనిచేసేవారు. ఆయన మరణాన్నితట్టుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌బాబు పోస్ట్‌ చేశాడు.

Here's BA Raju Passes Away Updates

ఇక బీఏ రాజు మరణవార్త తెలియగానే షాక్‌కి గురయ్యానంటూ జూనియర్‌ ఎన్జీఆర్‌ ట్వీట్‌ చేశాడు. పీఆర్వోగా, జర్నలిస్ట్‌గా ఫిల్మ్‌ ఇండస్ట్రీకి గొప్పసేవలు ఆయన అందించాడని, రాజుగారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశాడు. దర్శకులు సంపత్‌ నంది, మెహర్‌ రమేష్‌లు, యంగ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌, రైటర్‌ గోపీ మోహన్‌, దర్శకనిర్మాత మధురా శ్రీధర్‌ తదితరులు సోషల్‌ మీడియాలో బీఏ రాజు మృతి పట్ల నివాళులర్పించారు.

1500 చిత్రాలకు పీఆర్వోగా పని చేసిన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని రాజమౌళి అన్నారు. ఎంతో మంచి వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని చెప్పారు. ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని అన్నారు. సమంత మాట్లాడుతూ... తన జీవితంలో బీఏ రాజు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పారు. తన తొలి ప్రాజెక్ట్ నుంచి ఆయన ఎంతో సపోర్ట్ అందించేవారని తెలిపారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు.