Telangana: ఒకరోజు లేస్తున్నాయ్, మరోరోజు పడుతున్నాయి! తెలంగాణలో కొత్తగా 03 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు, రాష్ట్రంలో 1085కు చేరిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య, ఈరోజు భేటీ అవుతున్న రాష్ట్ర కేబినేట్
Coronavirus outbreak in India (Photo Credits: IANS)

Hyderabad, May 5: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల ట్రెండ్ 'కొంచెం ఇష్టం- కొంచెం కష్టం' అన్నట్లుగా సాగుతున్నాయి. ఒకరోజు పెరుగుతున్నాయి, తర్వాత రోజు తగ్గుతున్నాయి. ఆదివారం నాడు 21 కేసులు రాగా, ఆ తర్వాత సోమవారం రాత్రి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం కేవలం 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1085కు చేరింది.

మరోవైపు ఈ కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న బాధితుల సంఖ్య కూడా రోజురోజుకి మెరుగవుతుంది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపై దాదాపు 53 శాతం పేషెంట్లు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న కూడా 40 మంది డిశ్చార్జ్ అయ్యారు, కొత్తగా కరోనా మరణాలేమి కూడా నమోదు కాలేదు. దీంతో ఆసుపత్రి మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 585కు పెరగగా, మరణాల సంఖ్య 29 గానే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 471 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

#COVID19 in Telangana:

 

Status of positive cases of #COVID19 in Telangana

ఈరోజు తెలంగాణ కేబినేట్ భేటీ:

రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ఎళ్లుండితో ముగుస్తుండటంతో ఈరోజు తెలంగాణ కేబినేట్ సమావేశం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఇప్పటికే మే 17 వరకు పొడగించిన నేపథ్యంలో జోన్ల వారీగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ మార్గ దర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ కూడా లాక్డౌన్ ను మరో 2 వారాల పాటు పొడగించేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే గ్రీన్ జోన్లలో మద్యపానం అమ్మకాలపై కేంద్రం ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ను తెలంగాణ సర్కార్ పాటిస్తుందా, తిరస్కరిస్తుందా? అనేది ఈరోజు సమావేశంతో స్పష్టత రానుంది.