TS EAMCET 2020: ప్రారంభమైన తెలంగాణ ఎంసెట్, బయోమెట్రిక్‌ బదులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానంలో విద్యార్థుల ఫొటోలు, సెప్టెంబర్ 15 నుంచి ఓయూ పరీక్షలు
Representational Image (Photo Credits: PTI)

Hyderabad, Sep 9: తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET 2020) బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం హాల్‌టికెట్‌తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్‌ను కూడా నిర్వాహకులు ఇచ్చారు. కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభణ నేపథ్యంలో విద్యార్థులకు టెంపరేచర్‌ చెక్‌ చేసి, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలకు పంపారు. పరీక్షా కేంద్రాలను కూడా శానిటైజ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు.

విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్‌ బదులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానంలో విద్యార్థుల ఫొటోలు తీసుకోనున్నారు. తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని విద్యార్థులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్‌ సెషన్‌లో ఈ మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుంది. తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ జరగనుంది.

తెలంగాణలో కొత్తగా మరో 2,479 పాజిటివ్ కేసుల నమోదు, రాష్ట్రంలో 1 లక్షా 47 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 916కు పెరిగిన కరోనా మరణాలు

ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి దశలవారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కోర్సుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను ఓయూ పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్‌ వెంకటేశ్‌ విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి ఇంజినీరింగ్‌, ఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, బీసీఏ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ-3, 5వైడీసీ, ఎల్‌ఎల్‌ఎం, బీపీఈడీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి డిగ్రీలోని బీఎస్సీ, బీఏ, బీకాం, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ పరీక్షలకు ఈ నెల 14వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ సూచించింది.

ఆలస్య రుసుముతో ఈ నెల 19వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది. కరోనా జాగ్రత్తలతో యూసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో చివరి ఏడాదిలో 1.10 లక్షల మంది విద్యార్థులుండగా.. 65 వేల మంది డిగ్రీ కోర్సులు, 20 వేల మంది సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు. మరో 25వేల మంది పీజీ కోర్సులు చేస్తున్నారు. ఈ సారి విద్యార్థులు చదివే కళాశాలలోనే పరీక్షలు నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది.

కళాశాలలో విద్యార్థుల సంఖ్య వంద దాటితే అదే కళాశాలలో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. అదే 50-60 మంది విద్యార్థులుంటే రెండు, మూడు కళాశాలలను కలిపి ఒక కేంద్రంగా ఎంపిక చేస్తున్నారు. తొలిసారిగా డిగ్రీ పరీక్షల్లో ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థుల హాజరును తీసుకోనున్నారు. ప్రస్తుతం హాజరు కాలేని విద్యార్థులకు రెండు నెలల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల కంట్రోలర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ తెలిపారు.