TS Inter Results 2021: తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత, ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు
Representational Image (Photo Credits: PTI)

Hyderabad, June 28: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు (telangana-inter-results-2021-announced) సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,76,719 మంది ‘ఏ’ గ్రేడ్‌... 1,04,888 మంది ‘బీ’ గ్రేడ్‌ సాధించారు. ఇక 61,887 మంది ‘సీ’ గ్రేడ్‌... 1,08,093 మంది ‘డీ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు కేటాయించారు. ఇంటర్‌ సెకండియర్‌ ప్రాక్టికల్స్‌కు వందశాతం మార్కులు ఇచ్చారు. కాగా మంగళవారం వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇక మహమ్మారి కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేసి, సెకండియర్‌ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులు కేటాయించే విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఫలితాలను  https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఒక్కో నిరుపేద షెడ్యూల్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, దళితులపై దాడి చేసే పోలీసుల ఉద్యోగం తొలగింపు; అఖిలపక్షం నిర్ణయాలకు సీఎం ఆమోదం

మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలు

  • 2020–21లో విద్యార్థులకు ప్రథమ సంవత్సరం (జనరల్, వొకేషనల్, బ్రిడ్జి కోర్సు)లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు సెకండియర్‌ (2021–22)లో మార్కులను కేటాయించారు
  • ప్రతి సబ్జెక్టులో ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లోనూ ఇచ్చారు
  • సెకండియర్‌ ఫీజు చెల్లించిన విద్యార్థులు (రెగ్యు లర్, ప్రైవేటు) ఫస్టియర్‌లో ఫెయిలై ఉంటే 35% కనీస పాస్‌ మార్కులను కేటాయించారు.
  • కరోనా కారణంగా ఈ సంవత్సరం ప్రాక్టికల్స్‌ నిర్వహించలేదు కాబట్టి అందరికీ ప్రాక్టికల్స్‌లో 100 శాతం మార్కులను ఇచ్చారు
  • ప్రైవేటు విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో ఫెయిలై ఉంటారో ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస పాస్‌ మార్కులను ఇచ్చారు.
  • హాజరు మినహాయింపు కేటగిరీలో, అదనపు సబ్జెక్టుల్లో పరీక్షలకు హాజరు కావాలనుకున్న మ్యాథమెటిక్స్‌ జనరల్‌ బ్రిడ్జి కోర్సు, వొకేషనల్‌ బ్రిడ్జి కోర్సు, హ్యుమానిటీస్‌ కోర్సుల విద్యార్థులు ఫస్టియర్‌లో ఫెయిలై ఉంటే ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస మార్కులను ఇస్తారు. వారికి సెకండియర్‌లోనూ ఆయా సబ్జెక్టుల్లో అవే మార్కులను కేటాయించారు.
  • ఎథిక్స్, హ్యూమన్‌ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందని సెకండియర్‌ విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస మార్కులను ఇచ్చారు.
  • ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు తరువాత పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించారు. కరోనా అదుపులోకి వచ్చి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఆ పరీక్షలకు హాజరై మార్కులను పెంచుకోవచ్చు.