AP Grama Sachivalayam Results 2019: ఏపీ గ్రామ సచివాలయ ఫలితాలు విడుదల, అర్హత సాధించిన వారెవరు ? జాయినింగ్ డేట్ ఎప్పుడు ? జాయినింగ్ ప్రాసెస్ ఏంటీ ? పూర్తి వివరాలు తెలుసుకోండి
AP Grama Sachivalayam Results 2019

Amaravathi, September 19: ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలు రాసిన లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాలను gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. కేవలం 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ మొదటి వారంలో ఎగ్జామ్స్ నిర్వహించారు. 19 రకాల పోస్టులకు 14 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1, 26, 728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 21.5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 30, అక్టోబర్‌ 1న శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 2న అభ్యర్థులు విధుల్లో చేరనున్నారు.

క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేస్తున్న సీఎం జగన్:

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పినట్లుగా సచివాలయ ఉద్యోగాలను రికార్డు సమయంలో భర్తి చేశామని అన్నారు. 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేసేలా కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. ‘ఒకే నోటిఫికేషన్‌ ద్వారా 1,26,738 శాశ్వత ఉద్యోగాలు కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపికైన వారికి మంచి శిక్షణ ఇస్తాం. వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలి. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు. అంకితభావంతో పరీక్షలు నిర్వహించి మంచి పనితీరును కనబరిచారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకే సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందుతాయి’ అని సీఎం జగన్‌ అన్నారు.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలకు సంబంధించి జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలకు మార్గదర్శకాలు పేర్కొంటూ మంగళవారం (సెప్టెంబరు 17) ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరించనుండగా.. ఉపాధ్యక్షుడిగా జాయింట్‌ కలెక్టర్‌, కన్వీనర్‌గా జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కమిషనర్‌, సభ్యులుగా ఇతర ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్ల వ్యవహరించనున్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబరు 2న విధుల్లో చేరతారు. నియామకాలు పొందినవారికి రూ.15 వేల స్టైఫండ్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత శాశ్వత పే స్కేలు వర్తింపజేయనున్నారు.

1,26,728ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షలకు 19,50,630 మంది హాజరయ్యారు. వీరిలో 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఉద్యోగాలకు అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు

ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%, వెనుక బడిన తరగతులకు చెందిన వారికి 35%, ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు 30% గా నిర్ణయించారు.

పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన గ్రామ సచివాలయము/ఆర్ టి జి.ఎస్ వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును.

http://gramasachivalayam.ap.gov.in/

http://vsws.ap.gov.in/

http://wardsachivalayam.ap.gov.in/

https://www.rtgs.ap.gov.in/

ఫలితాల ప్రకటన అనంతరం, అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్‌లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను. తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదీలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్‌లను తనిఖి చేయించుకోవలెను.

వెరిఫికేషన్ షెడ్యూలు ఇదే

ఫలితాల విడుదల 19.09.2019, సర్టిఫికేట్‌ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ 21.09.2019 నుండి, కాల్ లెటర్ పంపిణి 21.09.2019 – 22.09.2019, తనిఖీ జరిగే తేదీలు 23- 25 సెప్టెంబర్ 2019, నియామక ఉత్తర్వుల జారి 27.09.2019, అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019, గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019.