Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి
Rains (Photo Credits: PTI)

Hyd, Sep 5: దేశంలో మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో (Weather Forecast) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని (Heavy Rains to hit in Telugu States) హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి కొమోరిన్‌ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక అంతటా సముద్రమట్టానికి 0.9కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించారు.దీని ప్రభావంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (HMD) తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert) జారీచేసింది.

షాకింగ్ వీడియోలు, భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతున్న బెంగుళూరు, నీటిపై తేలుతూ కొట్టుకుపోతున్న బైకులు

మంగళవారం నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాగా, గడిచిన 24 గంటల్లో వికారాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసినట్లు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.

సెప్టెంబర్‌లో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా అర్లి గ్రామంలో శనివారం 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది. గత పదేళ్లలో సెప్టెంబరు నెల చరిత్రలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు హిమాలయాల వైపు వెళ్లిపోవడంతో వాతావరణం వేడెక్కుతోందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు.

గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉపరితల ద్రోణిగానీ, ఆవర్తనంగానీ లేకపోవడంతో వేడిమి పెరిగిపోతోందని పేర్కొన్నారు. అధిక వేడి వల్ల ఇళ్లు, పరిశ్రమలు, వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. గరిష్ట విద్యుత్తు డిమాండు శనివారం 12,860 మెగావాట్లుగా నమోదైంది. ఇది ఏప్రిల్‌ నెల వినియోగంతో సమానమని తెలంగాణ విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ (AP Rains) మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయని వివరించింది.. దీని ప్రభావంతో వానలు పడతాయని వివరించింది.