New Delhi, Feb 3: మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగరాజ్ కుంభమేళా తొక్కిసలాట (Kumbh Mela) ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తొక్కిసలాటపై యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిల్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది.
గత నెల 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మంది గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాటను నిరోధించడంలో యోగి సర్కార్ విఫలమైందంటూ న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు వేశారు. 30 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పిల్ లో పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన యూపీ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. దేశ వ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, ఇది దురదృష్టకరమైన ఘటన అని తెలిపిన ధర్మాసనం ఈ పిల్ను తిరస్కరించింది. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలంటూ పిటిషనర్ విశాల్ తివారీకి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సూచించారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు.ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.