Coronavirus Alert: కరోనావైరస్ లక్షణాలతో మరో 12 మంది హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిక, ప్రత్యేక వార్డుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్న వైద్యులు
Gandhi Hospital, Hyderabad | File Photo

Hyderabad, February 6:  ప్రాణాంతక అంటువ్యాధి నోవెల్ కరోనావైరస్ (Novel Coronavirus ) బారిన పడినట్లు అనుమానిస్తున్న 12 మంది కొత్త రోగులు హైదరాబాద్ గాంధీ (Hyderabad Gandhi Hospital) మరియు ఫీవర్ ఆసుపత్రులలో చేరారు. దీంతో హైదరాబాద్ లో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 63 కి చేరుకుంది. 12 మంది రోగులలో, ముగ్గురు ఎయిర్‌హోస్టెస్‌లు ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం ఈ రోగులను ఐసోలేషన్ వార్డులలో ఉంచి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు, వారి రక్త పరీక్షా నమూనాలను సేకరించారు.

ఈ మొత్తం 12 మంది రోగులలో, ఎనిమిది మంది గాంధీ ఆసుపత్రిలో ఉంచగా, మిగిలిన నలుగురుని ఫీవర్ ఆసుపత్రిలో ఉంచారు. ఇందులో తొమ్మిది మంది రోగులు చైనా నుండి తిరిగి వచ్చిన వారే కాగా, ఒకే కుటుంబానికి చెందిన వారు 5 మంది ఉండటం గమనార్హం. తమ శరీరంలో వైరస్ (nCoV) లక్షణాలు గమనించిన వారు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. కేరళ నుంచి నగరానికి వచ్చిన ఓ యువతి కరోనావైరస్ లక్షణాలతో గురువారం గాంధీ ఆసుపత్రిలో చేరింది. వీరందరికీ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోనే కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు

కరోనావైరస్ కు సంబంధించి రోగుల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించే రాష్ట్ర నోడల్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు కరోనావైరస్ అనుమానంతో గాంధీ ఆసుపత్రిలో చేరిన 63 మందిలో 25 మంది రోగుల రిపోర్టులు 'నెగెటివ్' అని తేలినట్లు వెల్లడించారు. మిగిలిన వారి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.

ఇక గాంధీ ఆసుపత్రిలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఐసోలేషన్ వార్డుల్లో రోగుల నిరంతర పర్యవేక్షణ మరియు ఐసోలేషన్ వార్డుల నిర్వహణ సామర్థ్యం పెంచేదిశగా అవసరమయ్యే ఏర్పాట్లు మరియు సిబ్బందిని పెంచాలని జిల్లా వైద్యాధికారులకు నోడల్ అధికారి ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు అనుమానిత రోగులను ఐసోలేషన్ వార్డుల్లో ఉంచడం ద్వారా ఆ ఒంటరితనం రోగులపై మానసిక ప్రభావాన్ని చూపుతుందని, అది వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్య 560 దాటినట్లు చైనా అధికారులు వెల్లడించారు మరియు ఇప్పటివరకు చైనాలోని వివిధ ప్రాంతాల్లో 24,324 నవల కరోనావైరస్ సంక్రమణ కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ నివేదించింది.