17 MPs COVID-19 Positive: ఢిల్లీకి చేరిన ఎంపీల్లో కరోనా కలవరం, 17 మందికి పైగా ఎంపీలకు కోవిడ్-19 పాజిటివ్, కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం
Indian Parliament (Photo credits: Wikimedia Commons)

NeW Delhi, Sep 14: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న పలువురు ఎంపీలకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా 17 మందికి పైగా ఎంపీలకు కరోనా (17-lok-sabha-mps-test-covid-19-positive) సోకినట్లు తేలింది. అత్యధికంగా బీజేపీకి (BJP) చెందిన 12 మంది ఎంపీలు కరోనా బారిన పడినట్లు పరీక్షల్లో బయటపడింది. అదే విధంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి YSRCP) చెందిన ఇద్దరు ఎంపీలు, శివసేన (Shiv sena), డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) (DMK), ఆర్‌ఎల్‌పీ(రాష్ట్రీయ లోక్‌తంత్రిక్‌ పార్టీ) (RLP) ఎంపీలు ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారిన పడినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైరస్‌ స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు

రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి, బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇతరుల్లో రీటా బహుగుణ జోషి, కౌశల్ కిషోర్, సుఖ్‌బీర్ సింగ్, హనుమాన్ బెనివాల్, ఎస్.మజుందార్, గొడ్డేటి మాధవి, ప్రతాప్ రావు జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా, ఎన్.రెడ్డప్ప, సెల్వం జి, ప్రతాపరావు పాటిల్, రామ్ శంకర్ కథేరియా, సత్యపాల్ సింగ్, రాడ్మల్ నగర్ ఉన్నారు. ఆది, సోమవారాల్లో ఎంపీలకు ఈ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

నేటి నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు

కరోనా ముప్పు (Coronavirus) కొనసాగుతున్నందున పార్టీలకు అతీతంగా పలువురు సీనియర్ ఎంపీలు సభా కార్యక్రమాలకు (Parliament Monsoon Session 2020) దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో తొలిరోజున లోక్‌సభ ఛాంబర్‌కు సుమారు 200 మంది సభ్యులు హాజరయ్యారు. విజిటర్స్ గ్యాలరీలో 30 మంది వరకూ సామాజిక దూరం పాటిస్తూ కూర్చొన్నారు. సహజంగా ఆరుగురు సభ్యులు కూర్చునే వరుసలో ముగ్గురికి పరిమితం చేశారు.కాగా, రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన జేఎంఎం నేత శిబు సోరెన్, డీఎంకే ఎంపీ టి.శివ తదితరులు సోమవారంనాడు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ కారణంగా ఎంపీలు సంతకం చేసిన పెన్నులను ఎప్పటికప్పుడు మార్చారు.

చైనా భారీ కుట్ర, దేశంలో అగ్రనేతలపై రహస్య నిఘా, సంచలనం రేపుతున్న జాతీయ పత్రిక కథనం, ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కేంద్రం తెలిపినట్లుగా మరో పత్రిక కథనం

లోక్‌స‌భ ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌రిగింది. ఇప్పుడు రాజ్య‌స‌భ మ‌ధ్యాహ్నం 3 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ది. కొత్త స‌భ్యులు అజిత్ కుమార్‌, పూలో దేవి నీత‌మ్‌ల చేత చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. అన్ని జాగ్రత్తలతో, కోవిడ్‌ –19 నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, కొత్త విధి, విధానాలతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కోవిడ్‌–19 నెగెటివ్‌ ఉన్నవారికే సభలోనికి అనుమతించడంతో పాటు, మాస్క్‌ కచ్చితంగా ధరించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉభయ సభలు తొలిసారి విడతలవారీగా సమావేశం కావడం ఈ సమావేశాల ప్రత్యేకత.

సోమవారం లోక్‌ సభ సమావేశాలు ఆరంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సభ సంతాపం తెలిపింది. దేశానికి ప్రణబ్‌ సేవలను సభ కొనియాడింది. ఏ పదవిలో ఉన్నా ప్రణబ్‌ ముఖర్జీ ఆ పదవికి వన్నె తెచ్చారని స్పీకర్‌ ఓం బిర్లా ప్రశంసించారు. ఇటీవల మృతి చెందిన తమిళనాడు ఎంపీ వసంత్‌కుమార్‌, పండిత్‌ జస్రాజ్‌, అజిత్‌ జోగి, చేత‌న్ చౌహాన్ తదితరులకు సభ సంతాపం తెలిపింది. అలాగే క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన క‌రోనా యోధుల‌కు కూడా పార్ల‌మెంట్ నివాళి అర్పిచింది. అనంతరం సభను గంటసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.