Birbhum Violence: బీర్భూమ్‌లో చల్లారని మంటలు, ఇద్దరు టీఎంసీనేతలపై దాడి, బీర్‌భూం హింసాత్మక ఘటనలో మృతులకు ప్రధాని సంతాపం, దోషుల్ని వదిలిపెట్టొద్దని దీదీ సర్కారుకు సూచన
PM Narendra Modi. (Photo Credits: ANI)

Kolakata, Mar 24: ప‌శ్చిమ బెంగాల్‌లో హింసా రాజ‌కీయం ఆగేలా క‌నిపించ‌డం లేదు. బీర్భూమ్ ఘ‌ట‌న (Birbhum Violence) జ‌రిగి రెండు రోజులైనా గ‌డ‌వలేదు… మ‌రో రెండు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. అధికార తృణ‌మూల్ పార్టీకి చెందిన నేత‌ల‌పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జ‌రిపారు. అయితే ఈ ఘ‌ట‌న‌లు రెండూ వేర్వేరు ప్రాంతాల్లో జ‌రిగాయి. నాదియా అనే గ్రామంలో తృణ‌మూల్ నేత స‌హ‌దేవ్ మండ‌ల్‌పై కాల్పులు జ‌రిపారు. దీంతో ఆ నేత అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

ఇక హుగ్లీలోని తార‌కేశ్వ‌ర్ గ్రామంలో తృణ‌మూల్ పార్టీకి చెందిన మ‌హిళా కౌన్సిల‌ర్ రూపా స‌ర్కార్‌ను కారుతో తొక్కి చంపే ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఆమెకు తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో ఆమెను ఆస్ప‌త్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు పేర్కొన్నాయి. రూపా స‌ర్కార్ పనుల నిమిత్తం బ‌య‌టికి వెళ్లి, తిరిగి వ‌స్తుండ‌గా… ఓ మారుతి కారులో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు త‌న‌ను వెంబ‌డించారని, వెన‌క నుంచి వ‌చ్చి యాక్సిడెంట్ చేశార‌ని తెలుస్తోంది.

పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌ అయ్యారు. నిన్న జరిగిన ఘటనలు అత్యంత హేయమైనవిగా పేర్కొన్న మోదీ.. ఈ ఘటనలో దోషుల్ని వదిలిపెట్టొద్దన్నారు. విక్టోరియల్‌ మెమోరియల్‌లో భారత స్వాతంత్య్ర సమరయోధులకు అంకితం చేసిన గ్యాలరీని బుధవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. హత్యాకాండలో నేరస్థుల్ని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. వీలైనంత త్వరగా దోషుల్ని చట్టం ముందుకు తీసుకొస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

తమ నేత హత్యకు ప్రతీకారం.. బెంగాల్‌లో ఐదు ఇళ్లకు బయట నుంచి తాళాలు వేసి నిప్పంటించిన దుండగులు, ఏడుగురు మంటల్లో సజీవదహనం

బీర్‌భూం హింసాత్మక ఘటనలో మృతులకు ప్రధాని ఈ సందర్భంగా సంతాపం (PM Narendra Modi Condoles Incident) తెలిపారు. ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన పాల్పడేవారిని, అలాంటివారికి సహకరించేవారిని ఎప్పటికీ క్షమించరాదని బెంగాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. దోషుల్ని పట్టుకొనేందుకు ఎలాంటి సాయం చేసేందుకైనా (Assures All Help to Bengal Govt) కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు, ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన తృణమూల్‌ కాంగ్రెస్ నేత, సీనియర్‌ మంత్రి పార్థ ఛటర్జీ దోషులను వేటాడి శిక్షిస్తామన్నారు.

బీర్‌భూం జిల్లా రామ్‌పుర్ హాట్‌ పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనమైన ఘటన తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్‌ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్‌ బాదు షేక్‌ హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వ్యక్తిగత కక్షల అనుమానంతో ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఇళ్లకు నిప్పుపెట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

బీర్బూమ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాంపూర్‌హాట్‌ గ్రామాన్ని సందర్శించనున్నారు. సీఎం మమతా బెనర్జీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. హింసాత్మక ఘటనలు జరిగిన రాంపూర్‌హాట్‌ గ్రామంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు భాదు షేక్ హత్యకు గురైన ఘటన తర్వాత 8మందిని దుండగులు కాల్చి చంపారు.రెండు వేర్వేరు ఘటనల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇద్దరు టీఎంసీ నేతలపై దాడులు జరిగాయి.మంగళవారం నాటి హింసాకాండ తర్వాత బీర్భూమ్‌లోని బోగ్టుయ్ గ్రామంలోని చాలా మంది నివాసితులు తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు.