Telangana Budget 2019-20: 1 లక్షా 46 వేల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. బడ్జెట్లోని ముఖ్యాంశాలు మరియు రంగాల వారీగా ముఖ్య కేటాయింపులు ఇలా ఉన్నాయి.
సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 14 వరకు వాయిదా వేశారు...
Hyderabad, September 09: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గతంలో అసెంబ్లీ ఆమోదం పొందిన ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ఈ సెప్టెంబర్ 30కి ముగుస్తుండటంతో 2019- 2020 సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ (K. Chandrashekhar Rao) ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఈరోజు తెలంగాణ ప్రజా కవి కాళోజి జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్ లోని కాళోచి చిత్రపటానికి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం సభను ప్రారంభించారు.
ఈ ఏడాది వార్షిక బడ్జెట్ సీఎం కేసీఆరే రూపకల్పన చేసిన నేపథ్యంలో ఆయనే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ 1 లక్ష 46 వేల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేసీఆర్, బడ్జెట్ కేటాయింపులు, గత ఐదేళ్లలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు, కేంద్రానికి రాష్ట్రం నుంచి చేసిన చెల్లింపులు, రాష్ట్ర అభివృద్ధి ఇతర అనేక అంశాలపై కేసీఆర్ ప్రసంగించారు.
కేసీఆర్ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది.
గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించింది, దేశంలో అగ్రగామిగా రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యింది, రాష్ట్ర వృద్ధి రేటు 10.5గా నమోదైంది.
2019-20కి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 1,46,492.3 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
మూలధనం వ్యయం రూ. 17,274.67 కోట్లు
బడ్జెట్ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం.
బడ్జెట్ లోని ముఖ్య కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
రైతు బంధు కోసం - రూ .12,000 కోట్లు
రైతు బీమా కోసం - రూ .1,137 కోట్లు
పంట రుణాల మాఫీ కోసం - రూ .6,000 కోట్లు
విద్యుత్ రాయితీల కోసం: రూ .8,000 కోట్లు
ఆసారా పెన్షన్లకు - రూ .9,402 కోట్లు
గత ఐదేళ్లలో కేంద్ర పథకాల అమలు కోసం అందిన నిధులు రూ. 31,802 కోట్లు మాత్రమే.
గత ఐదేళ్లలో రాష్ట్రం నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి వెళ్లిన నిధులు రూ. 2,72,926 కోట్లు
సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 14 వరకు వాయిదా వేశారు. ఈలోపు బీసీఎ సమావేశం నిర్వహించి, తదుపరి అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి, బడ్జెట్ పై చర్చ, సభలో చర్చించాల్సిన అజెండా మొత్తం ఖరారు చేస్తారు.
(The above story first appeared on LatestLY on Sep 09, 2019 01:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

