Coronavirus Outbreak: ఇండియాలో 107కి చేరిన కరోనా కేసులు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ధియేట్లరు, స్కూళ్లు, పబ్‌లు, మాల్స్ అన్నీ బంద్, అమెరికాలో అత్యవసర పరిస్థితి విధించిన ట్రంప్ సర్కారు
Coronavirus Outbreak | Representational Image (Photo Credits: PTI)

New Delhi, Mar 15: కరోనా వైరస్‌ (Coronavirus) దేశంలో వేగంగా విస్తరిస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌లో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య (Coronavirus In India) 107కు పెరిగింది. మహారాష్ట్రలోనే శనివారం ఐదు కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆ రాష్ట్రంలో వైరస్‌ (COVID-19) సోకిన వారి సంఖ్య ఇప్పటికీ 31కి చేరింది. పుణే, ముంబై, నాగపూర్‌, యావత్మాల్‌లో కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వంద దాటగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా దీనిని నిర్ధారించలేదు.

రూ.4 లక్షలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కేంద్రం

ఇక జైపూర్‌లో 24 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా రాజస్ధాన్‌లో డెడ్లీ వైరస్‌ కేసుల సంఖ్య నాలుగుకి పెరిగింది. ఈ వ్యక్తి ఇటీవల స్పెయిన్‌ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో నవీ ముంబైలో మైండ్ స్పేస్ లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఆఫీసుకు ఎవరూ రావొద్దన యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 29 వరకు ఇంటినుంచే పనిచేయాలని ఉద్యోగులను కోరింది.

మరోవైపు రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించి కార్యాచరణకు పూనుకుంది. విద్యాసంస్ధలు, వ్యాపార సముదాయాలు, థియేటర్లు, మాల్స్‌ను ఈ నెలాఖరు వరకూ మూసివేయాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి.

ఇండియాలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు, పబ్ లు, మాల్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పార్లమెంట్ సముదాయంలోకి సందర్శకులకు నో ఎంట్రీగా ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర పలు ఆంక్షలు విధించారు. భూటాన్ సరిహద్దును పశ్చిమబెంగాల్ మూసివేసింది. పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్న కర్తార్ పూర్ కారిడార్ ని కూడా మూసివేశారు.

కరోనావైరస్ 151 దేశాలకు వైరస్ పాకింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 5,821కి చేరింది. లక్షా 56 వేల 433 మంది బాధితులు ఉన్నారు. 5 వేల 909 మందికి సీరియస్ అయింది. నాలుగు రాష్ట్రాలు మినహా అమెరికా అంతటా వైరస్ వ్యాపించింది. అమెరికాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

ఇటలీలో నిన్న ఒక్కరోజే 3497 కేసులు నమోదు కాగా, 175 మంది మృతి చెందారు. ఇరాన్ లో నిన్న 1365 కేసులు నమోదు కాగా 97 మంది చెందారు. స్పెయిన్ లో 1159 కేసులు నమోదు, 62 మంది మృతి చెందారు.