Cyclone Hamoon Update: బంగ్లాదేశ్ తీరం వైపు కదిలిన హమూన్ తుఫాను, ఒడిశాలోని పారదీప్కు 230 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం సైక్లోన్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం తీవ్ర తుఫాన్గా మారింది. బంగ్లాదేశ్ తీరప్రాంతంపై ఈ తుఫాను 'హమూన్' ల్యాండ్ఫాల్ ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే ఆరు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం తీవ్ర తుఫాన్గా మారింది. బంగ్లాదేశ్ తీరప్రాంతంపై ఈ తుఫాను 'హమూన్' ల్యాండ్ఫాల్ ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే ఆరు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) తెలిపింది. దానికి ఇరాన్ సూచించిన ‘హమూన్’అని పేరు పెట్టారు. అయితే ఒడిశాకు దానివల్ల పెద్ద నష్టమేమీ లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ, వచ్చే ఆరు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి, తదుపరి ఆరు గంటల్లో మరింత అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది.
ఒడిశా తీరానికి 200 కిలోమీటర్ల దూరం నుంచి బంగ్లాదేశ్ కేసి సాగుతూ మంగళవారం రాత్రికి బలహీనపడింది. బంగ్లాదేశ్లో తీరం దాటేసరికి మరింత బలహీన పడుతుందని అధికారులు తెలిపారు.హమూన్ ప్రస్తుతం ఒడిశాలోని పారదీప్కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని దిఘాకు 240 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల తీరం వెంబడి గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 100 కి.మీ వేగంతో దూసుకుపోతుందని IMD Xలో పోస్ట్ చేసింది.
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రానున్న మూడు రోజులు, రాయలసీమలో ఈనెల 29వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుంది. 28 నుంచి కోస్తాంధ్రలో, 30 నుంచి రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
(The above story first appeared on LatestLY on Oct 25, 2023 12:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

