Farm Bills Chaos: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం, ఏకమై నోటీసు ఇచ్చిన 12 విపక్ష పార్టీలు, ప్రతిపక్షాల ఆందోళనను విస్మరిస్తూ బిల్లులు ఆమోదిస్తారా అంటూ ధ్వజమెత్తిన విపక్షాలు
Rajya Sabha Deputy Speaker Harivansh | (Photo Credits: RSTV/Screengrab)

New Delhi, September 20: రాజ్యసభలో విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్దల సభలో రేగిన దుమారం కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని(No-Confidence Motion Against Rajya Sabha Deputy Chairman) సమర్పించాయి. అగ్రి బిల్లులను సభలో హడావుడిగా ఆమోదింపచేసిన ఆయన తీరుపై మండిపడుతున్న విపక్ష పార్టీలు ఈ మేరకు చర్యలు చేపట్టాయి.

హరివంశ్‌పై (Harivansh Singh) అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్‌ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ వెల్లడించారు.

సోమవానం నాటి సమావేశంలో ఈ అవిశ్వాస తీర్మానం సభ ముందుకు రావచ్చని తెలుస్తున్నది. ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించాల్సిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, ప్రక్రియలకు హాని కలిగించిన విధంగా వ్యవహరించారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ విమర్శించారు. చరిత్రలో ఈ రోజు 'బ్లాక్ డే' గా మిగులుతుందని అన్నారు.

విపక్షాల నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం, రాజ్యసభ సోమవారానికి వాయిదా, ‌ బిల్లు ముసాయిదా ప్రతులను చించేసిన విపక్ష ఎంపీలు

వ్యవసాయ బిల్లులు ఆమోదించబడిన విధానం ప్రజాస్వామ్య ప్రక్రియలకు వ్యతిరేకంగా ఉన్నదని, ఇది ప్రజాస్వామ్యం కూనీకి సమానమని ఆయన ఆరోపించారు. అందుకే డిప్యూటీ చైర్మన్‌కు వ్యతిరేకంగా 12 ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయని అహ్మద్ పటేల్‌ తెలిపారు.విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రెన్‌ ఆరోపించారు.విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం​ బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు.

వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు, రైతులు ముందుగానే ధర నిర్ణయించుకునే అవకాశం, మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందని తెలిపిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి

ఇక గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఆదివారం రాజ్యసభ ఆమోదించింది. అయితే స‌వ‌ర‌ణ‌ల‌పై స‌భ్యుల వివ‌ర‌ణ తీసుకోకుండానే వాయిస్ ఓటుకు వెళ్లారని విపక్షాలు మండిపడ్డాయి. టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ డిప్యూటీ చైర్మన్ చైర్ వైపు దూసుకువెళ్లారు. త‌న చేతిలో ఉన్న రూల్ బుక్‌ను ఆయనకు చూపించే ప్రయత్నం చేశారు. కొందరు ఎంపీలు కూడా పోడియం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. తీవ్ర గంద‌ర‌గోళం మ‌ధ్య డిప్యూటీ చైర్మన్ వాయిస్ ఓటు ద్వారా అగ్రి బిల్లుల‌ను పాస్ చేసి సభను సోమవారానికి వాయిదా వేశారు. డిప్యూటీ చైర్మన్ తీరుపై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్లు వెల్లడించాయి.