New Delhi, Aug 16: దేశంలో గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. తాజాగా 11,81,212 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 32,937 మందికి పాజిటివ్గా (Coronavirus in India) తేలింది. ముందురోజు కంటే కేసులు 8.7శాతం మేర తగ్గాయి. నిన్న మరో 417 మంది (Covid Deaths) మరణించారు. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు (COVID-19 in India) చేరగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,31,642గా ఉంది. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం కూడా కేసుల సంఖ్యలో క్షీణతకు కారణంగా కనిపిస్తోంది.
ఇక నిన్న 35,909 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.14 కోట్ల మంది వైరస్ను జయించగా.. రికవరీ రేటు 97.48 శాతానికి చేరింది. ప్రస్తుతం 3,81,947 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 1.19 శాతానికి తగ్గింది. నిన్న సెలవురోజు కావడంతో వ్యాక్సినేషన్ నెమ్మదించింది. తాజాగా 17,43,114 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 54,58,57,108కి చేరింది.
గోవాలో ప్రస్తుతం కొనసాగుతున్న కొవిడ్ కర్ఫ్యూను ప్రభుత్వం మరో వారం పొడగించింది. ఈ నెల 23 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో గోవాలో మే 9న తొలిసారిగా కర్ఫ్యూ విధించింది. అప్పటి నుంచి పొడగిస్తూ వస్తున్నది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో పలు ఆంక్షలు సడలింపు ఇవ్వడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
దుకాణాలు, మాల్స్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే సెలూన్, అవుట్డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియాలు తెరుచుకున్నాయి. జిమ్లో 50శాతం సామర్థ్యంతో పని చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగా.. గోవా జనాభాలో 90శాతం మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ఫ్రంట్లైన్ కార్మికులు, కొవిడ్ యోధుల కృషితో రాష్ట్రం మహమ్మారిపై పోరాడిందన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం గోవాలో కొత్తగా 75 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో కరోనా మహమ్మారి ( Covid-19 ) వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. అక్కడ ప్రతిరోజూ దాదాపు 20 వేల వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 18,582 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా రికవరీలు అంతకంటే ఎక్కువే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,089 మంది కరోనా మహమ్మారి బారినుంచి బయటపడ్డారు. ఇక కరోనా మరణాలు కూడా కేరళలో భారీగానే నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో కొత్తగా 102 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 18,601కి పెరిగింది. ఇక ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులలో కరోనా రికవరీలు, మరణాలు పోను మరో 1,78,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అక్కడ కరోనా పాజిటివిటీ రేటు కూడా 15.11 శాతానికి పెరిగింది. అంటే పరీక్షలు చేయించుకున్న ప్రతి 100 మందిలో 15.11 మందికి పాజిటివ్ వస్తున్నదన్నమాట.