COVID19 in India: భారత్‌లో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లేనా? దేశవ్యాప్తంగా కొత్తగా 62,480 కోవిడ్19 కేసులు నమోదు, 73 రోజుల తర్వాత 8 లక్షల దిగువకు ఆక్టివ్ కేసులు
Coronavirus Outbreak| (Photo Credits: IANS)

New Delhi, June 18: భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటికంటే ఈరోజు సుమారు 5 వేల మేర తగ్గాయి, అలాగే కోవిడ్ మరణాలు కూడా నిన్న 2 వేలకు పైగా నమోదయితే ఈరోజు 15 వందలకు తగ్గాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య నిన్నటితో పోలిస్తే తక్కువగానే ఉన్నా, కోవిడ్ రికవరీ రేటు మాత్రం అతి స్వల్పంగా మెరుగుపడింది, ఆక్టివ్ కేసులు 8 లక్షలకు దిగువన అంటే 73 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. గణాంకాలని బట్టి చూస్తే సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లే అనిపిస్తోంది. అయితే మహారాష్ట్రలో ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగులోకి రావడం కలవర పెడుతుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు మరికొన్ని రోజులు కఠినంగా పాటించాలని, ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేని పక్షంలో సెకండ్ వేవ్ నియంత్రణలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే థర్డ్ వేవ్ కోవిడ్ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు..

గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 62,480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కేసులు  సుమారు 5 వేల మేర తగ్గాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,62,793 చేరింది. నిన్న ఒక్కరోజే 1,587 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,83,490కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 88,977 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,85,80,647 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 7,98,656 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.03% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.68 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.29% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూన్ 17 నాటికి దేశవ్యాప్తంగా 38,71,67,696 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,29,476 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 32,59,003 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 26.89కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 26,89,60,399 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 21.88 కోట్లు ఉండగా, 5.08 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.