Second Wave in India: భారత్‌లో నియంత్రణలోకి వస్తున్న కరోనా సెకండ్ వేవ్, కొత్తగా 1.34 లక్షల మందికి పాజిటివ్, 3 వేల దిగువకు పడిపోయిన కోవిడ్ మరణాలు, దేశవ్యాప్తంగా మరో 2.11 లక్షల మందికి పైగా రికవరీ
COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, June 3: భారత్‌లో సెకండ్ వేవ్ నియంత్రణలోకి వస్తోంది, ఇప్పటికీ కేసులు లక్షకుపైనే నమోదవుతున్నప్పటికీ గతంతో పోలిస్తే వైరస్ వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గింది. అదే విధంగా రికవరీ రేటు మరింత మెరుగుపడింది, ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు సుమారు 93 శాతంగా ఉంది. అయితే కోవిడ్ మరణాలు కొంత ఇబ్బంది కలిగించే విషయమే అయినా పరిస్థితులు కొద్దికొద్దిగా మెరుగుపడుతున్నాయి. తాజాగా రోజూవారి కోవిడ్ మరణాలు 3 వేల దిగువకు పడిపోయాయి.

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కేసులు స్వల్పంగా సుమారు 2 వేల మేర పెరిగాయి.  తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,41,986 చేరింది. నిన్న ఒక్కరోజే 2,887 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,37,989కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,11,499 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,63,90,584 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 17,13,413 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 92.79% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 6.02 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.19% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూన్ 2 నాటికి దేశవ్యాప్తంగా 35,37,82,648 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 21,59,873 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 24,26,265 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 22.10 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 22,10,43,693 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 17.55 కోట్లు ఉండగా,  4.53 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.