Second Wave in India: భారత్‌లో భారీగా తగ్గిన రోజూవారీ కోవిడ్ కేసులు, కొత్తగా 1.86 లక్షల మందికి పాజిటివ్, గత 44 రోజుల్లో ఇదే కనిష్ఠం.. దేశవ్యాప్తంగా మరో 2.59 లక్షల మందికి పైగా రికవరీ
Coronavirus- India (Photo Credits: PTI)

New Delhi, May 28: భారత్‌లో సెకండ్ వేవ్ కోవిడ్ కేసులు క్రమేపీ తగ్గుతుండటం గొప్ప ఊరటనిచ్చే విషయం. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు తమ వద్ద కోవిడ్ ఉధృతి తగ్గినట్లు కేంద్రానికి నివేదిక అందించాయి. దాదాపు చాలా రాష్ట్రాల్లో రోజూవారీ కొత్త కేసుల క్షీణత కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశంలో పాజిటివిటీ రేటు కూడా 9% కి పడిపోయింది. కోలుకునే వారి రేటు 90 శాతానికి పైగా మెరుగైన స్థితిలో కొనసాగుతుంది. అయితే మరణాల రేటులో మాత్రం గణనీయమైన మార్పు లేదు. ప్రతిరోజూ 3 వేలకు పైగా మరణాలు నమోదవడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 14 నుంచి ఇదే అత్యల్పం. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,4573 చేరింది. నిన్న ఒక్కరోజే 3,660 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,18,895 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,59,459 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,48,93,410 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 23,43,152 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 90.34% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 8.05 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.16% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

మే 27 నాటికి దేశవ్యాప్తంగా 33,90,39,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 20,70,508 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 29,19,699 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 20.57 కోట్లు దాటింది.  తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 20,57,20,660 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 16.15 కోట్లు ఉండగా, సెకండ్ డోస్ తీసుకున్న వారి సంఖ్య 4.38 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం.