India's COVID19 Report: భారత్‌లో 84 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ; దేశవ్యాప్తంగా కొత్తగా 31,382  కోవిడ్ కేసులు, 318 మరణాలు నమోదు మరియు 32,542 మంది రికవరీ
covid-19-vaccination (Photo-PTI)

New Delhi, September 24: భారత్‌లో కోవిడ్19 సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే ఒకటి, రెండు చోట్ల మినహా దాదాపు దేశవ్యాప్తంగా పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. ఆక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ నివేదించింది. రోజూవారీ కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి, నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా కేసులు తగ్గాయి. అయితే కేరళ రాష్ట్రంలో పరిస్థితులు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ఆ రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికీ 1.60 లక్షలపైనే ఉండటం గమనార్హం. గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 31,382 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 318 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 19,682 కేసులు, 152 మరణాలు ఉన్నాయి.

తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,35,94,803 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,46,368కు పెరిగింది.

ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,542 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,28,48,273 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,00,162 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.78% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 0.89 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

సెప్టెంబర్ 23 నాటికి దేశవ్యాప్తంగా 55,99,32,709 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,65,696 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 72,20,642 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 84.15 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 84,15,18,026 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 62.29 కోట్లు ఉండగా, 21.86 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.